అక్కడేం జరుగుతుందో అర్థం కాక..

by  |
అక్కడేం జరుగుతుందో అర్థం కాక..
X

దిశ, నల్లగొండ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సూర్యాపేట జిల్లా గజగజ వణుకుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా శుక్రవారం మధ్యాహ్న సమయానికి కొత్తగా మరో నాలుగు కేసులు నమోదు కావడంతో సూర్యాపేట జిల్లా ఉలిక్కిపడింది. అయితే గురువారం ఒక్కరోజే 16 కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. మరుసటి రోజు మధ్యాహ్ననికే కొత్తగా మరో ఐదు పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

సూర్యాపేటలో పరిస్థితి ఇదీ..

సూర్యాపేట జిల్లాలో గురువారం నాటికి 39 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం మరో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తంగా సూర్యాపేట జిల్లాలో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క సూర్యాపేట జిల్లా నుంచే 502 మంది శాంపిల్స్ పరీక్షల కోసం పంపారు. ఇందులో 43 కేసులు పాజిటివ్ కాగా, 314 రిపోర్టుల్లో నెగిటివ్‌గా తేలాయి. ఇప్పటివరకు 358 మంది రిపోర్టులు రాగా, ఇంకా 144 శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి.

11 కు పెరిగిన కంటైన్‌మెంట్ జోన్లు..

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కంటైన్‌మెంట్ జోన్ల సంఖ్య 11 కు చేరింది. బుధవారం వరకు జిల్లాలో ఎనిమిది కంటైన్‌మెంట్ జోన్లు మాత్రమే ఉన్నాయి. గురువారం ఒక్క రోజే 16 కేసులు నమోదు కావడంతో కొత్తగా మరో మూడు కంటైన్‌మెంట్ జోన్లను ప్రకటించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, ఆత్మకూరు(ఎస్) మండలంలోని ఏపూరు, నేరేడుచర్ల గ్రామాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు.

నిర్లక్ష్యమే కొంప ముంచిది..

సూర్యాపేట జిల్లాలో ఇంత పెద్దఎత్తున కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడేందుకు కేవలం నిర్లక్ష్యమే కారణంగా కన్పిస్తోంది. వాస్తవానికి సూర్యాపేట పట్టణంలోని కుడకుడ ప్రాంతంలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదయ్యింది. అతడి నుంచి మరో 10 మందికి వైరస్ సోకింది. అయితే ఈ పది మందిలో ఓ వ్యక్తి మార్కెట్ ప్రాంతంలో తిరిగి కరోనా వైరస్ ఇతరులకు సోకేందుకు కారణమయ్యాడు. ఒకేఒక్క వ్యక్తి నుంచి 28 మందికి సోకినట్టు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.

ఆ ఇద్దరి వల్ల 38 మందికి పాజిటివ్..

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ ప్రాంతంలో వైరస్ సోకిన వ్యక్తుల కాంటాక్ట్ కలిగిన వ్యక్తులు 200 మంది ఉన్నారు. వారందరినీ ఇప్పటికే క్వారంటైన్‌కు తరలించగా, వారి నుంచి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలకు పంపారు. అందులో గురువారం 47 మంది రిపోర్టులు రాగా, అందులో 16 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే ఇప్పటివరకు జిల్లా నుంచి 502 మంది శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపిస్తే అందులో 358 మంది రిపోర్టులు వచ్చాయి. ఇంకా 149 మంది ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఇందులో కొసమెరుపు ఏమిటంటే.. కేవలం ఇద్దరు వ్యక్తుల నుంచి 38 మందికి కరోనా వైరస్ సోకింది. ఒక్కరికి మాత్రం ఈ ఇద్దరితో సంబంధం లేకుండా వైరస్ సోకింది.

Tags: Suryapet, Corona, Victims, Containment Zones, Positives



Next Story