దిశ రిపోర్టర్ మృతిపై వీడని మిస్టరీ..

by  |
దిశ రిపోర్టర్ మృతిపై వీడని మిస్టరీ..
X

దిశ, కరీంనగర్ సిటీ: సీనియర్ జర్నలిస్ట్ పోలాటి లక్ష్మణ్‌రావు మృతిపై ఇంకా మిస్టరీ వీడలేదు. మరణించి నెలరోజులు కావస్తున్నా, ఇప్పటివరకు పోలీసుల విచారణ ముందుకు సాగడం లేదు. రోడ్డు ప్రమాదం జరిగినా, దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఫిర్యాదు చేసినా, ఆ దిశగా స్పందించకపోవడంతో, మృతుడి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.

జిల్లాలోని హుజురాబాద్ మండలం దండేపల్లి గ్రామానికి చెందిన పోలాటి లక్ష్మణ్ రావు (42) హుజురాబాద్ కేంద్రంగా ప్రముఖ డిజిటల్ దిన పత్రిక దిశలో డివిజన్ రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నిత్యం తన గ్రామం నుంచి వస్తూ, పోతున్న క్రమంలో గత నెల 13న రాత్రి విధులు ముగించుకుని తన టూవీలర్ పై స్వగ్రామానికి వెళ్తుండగా, పరకాల క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా, మరుసటిరోజు తెల్లవారుజామున మృతి చెందాడు. ఆయన మృతిపై అనుమానాలున్నాయంటూ, విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలంటూ, లక్ష్మణరావు తల్లి అండాలమ్మ అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే, పోలీసులు ఆమె ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పటివరకు కేసు దర్యాప్తులో అడుగు ముందుకు పడలేదు. దీంతో మృతుడి తల్లి, సోదరి మరోసారి పోలీసులను కలిసి, దర్యాప్తులో వేగం పెంచాలంటూ కోరారు. అయినా స్పందన లేకపోవటంతో, మృతుడు లక్ష్మణ్ రావు మరణించిన గత నెల 13న హుజురాబాద్‌లో తిరిగిన వివరాలు, అందుకు సంబంధించిన సీసీ ఫుటేజీలు, ఆరోజు అతనికి వచ్చిన ఫోన్ కాల్స్, ప్రమాదం జరిగిన విషయం పోలీసులకు తెలిసిన వివరాలు, సమాచారమిచ్చిన వ్యక్తి వివరాలు, ప్రమాద సంఘటన వద్దకు వెళ్లిన పోలీసుల వివరాలు కోరుతూ గత నెల 30న సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయటం జిల్లా పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, పోలీసులు ఇప్పటికైనా స్పందించి దర్యాప్తులో వేగం పెంచి, వాస్తవాలు బహిర్గతం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Next Story

Most Viewed