వరి ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరుగొద్దు.. సిద్దిపేట కలెక్టర్

by  |
Siddipet Collector Venkatramireddy
X

దిశ, సిద్దిపేట: ఈ వర్షా కాలానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలను వందశాతం ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సిద్దిపేట కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట ఐడీఓసీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ప్రారంభంపై జిల్లాలోని రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 1 లక్షా 79 వేల మంది రైతుల నుంచి 6 లక్షల 86 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోళ్లు చేయడం కోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ అన్నారు.

జిల్లాలో మొత్తం ఐకేపీ-225, పీఏసీఎస్-156, ఏఏంసీ-10, మెప్మా-5 చొప్పున 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ప్రత్యేకంగా వ్యవసాయ విస్తరణ అధికారులు(AEO) ప్రతీ రైతుకు వరిసాగు ధృవీకరణ పత్రం, రైతుపేరు, పంట విస్తీర్ణం, రైతు బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ కార్డు నెంబర్ వంటి సమగ్ర వివరాలన్నీ పొందుపర్చి సంతకం చేసి ఇవ్వడం జరుగుతుందని, ఈ పత్రాన్ని రైతులు ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలకు వరి ధాన్యంతో పాటు తీసుకెళ్లాలని రైతులను కలెక్టర్ కోరారు. కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులు మూడు రోజుల్లో నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని చెప్పారు.

వరి ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరగొద్దని ప్రతీ 3 నుంచి 5 కేంద్రాలకు క్లస్టర్ అధికారులను నియమించినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో గన్నీ సంచుల సరఫరా చేస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రతీ క్లస్టరులో ఆ మండలం, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి నాయకులు, కమిటీ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, తదితర నాయకులను సమన్వయం చేసుకుంటూ అక్కడి ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించారు.

Next Story

Most Viewed