రికవరీ ఆలస్యమైతే డిమాండ్‌కు దెబ్బ: ఇండియా రేటింగ్!

by  |
రికవరీ ఆలస్యమైతే డిమాండ్‌కు దెబ్బ: ఇండియా రేటింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ నుంచి ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఆర్థిక కార్యకలాపాలు డిమాండ్ లేకపోవడం వల్ల ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడంలేదని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ అభిప్రాయపడింది. దీనివల్ల కార్పొరేట్ రుణాలు పెరిగే అవకాశాలున్నట్టు పేర్కొంది. టాప్ 500 ప్రైవేట్ కంపెనీల రుణా భారం పెరిగి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎన్‌పీఏలు ఏకంగా రూ. 1.67 లక్షల కోట్లు పెరుగుతాయని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ అంచనాలను వెల్లడించింది. కరోనాకు ముందు రూ. 2.54లక్షల కోట్లని అంచనా వేయగా, ప్రస్తుత కరోనా దెబ్బకు అదనంగా మరో రూ. 1.67లక్షల కోట్లను జత చేసింది. దీంతో మొత్తం రూ. 4.21లక్షల కోట్లకు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇది మొత్తం రుణాల్లో 6.63 శాతానికి సమానం. ఇంతకుముందు వేసిన అంచనా 4శాతంగా ఉండేది. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న రుణాలు 11.57 శాతం ఉంటే, తాజా అంచనాలను సవరించి 18.27 శాతానికి పెరగనున్నట్టు తెలిపింది. అలాగే, మొత్తం రుణ వ్యయాలు, మొండి బకాయిలపై కేటాయింపు 3.57 శాతానికి చేరుతాయని పేర్కొంది. రుణ వ్యయాలను అంచనా వేసిన రేటింగ్ ఏజెన్సీ, కార్పొరేట్ రుణాల ఒత్తిడి ఇంకా పెరిగి రూ. 1.68 లక్షల కోట్లకు చేరుకోవచ్చని, 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 5.98 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులుగా మారే ప్రమాదమున్నట్టు పేర్కొంది. ఇది మొత్తం రుణాల్లో 9.27 శాతానికి సమానం. ఒకవేళ ఇలా జరిగితే రుణ వ్యయాలు కూడా 4.82 శాతానికి పెరిగే అవకాశముంది. మిగిలిన రుణాల్లో 20.84 శాతం ఒత్తిడిని ఎదుర్కొనే ప్రమాదముంది. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాలను సవరించలేదని తెలిపింది. రుణభారం అంచనాల్లో మార్పు లేని కారణంగా మార్పులేమీ చేయలేదని పేర్కొంది. అయితే, 2021-22 ఆర్థిక సంవత్సరానికి కార్యకలాపాల్లో రికవరీ ఆలస్యమైతే డిమాండ్ దెబ్బతినే అవకాశముందని, దీనివల్ల ఒత్తిడిలో ఉన్న రుణాల అంచనాలను పెంచే అవకాశముందని వెల్లడించింది.



Next Story

Most Viewed