దళారుల వ్యవస్థకు దారులు

by  |
దళారుల వ్యవస్థకు దారులు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కొనుగోలు కేంద్రాలను ఎత్తేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దళారుల వ్యవస్థను దారులు తెరిచినట్లయింది. దీంతో దళారులు చెప్పిన ధరకే రైతు పంటను అమ్ముకోవాల్సి న పరిస్థితి. ఎలాంటి బిల్లులు లేకపోవడం, మద్దతు ధరలో కోత, తూకంలో మోసాలకు సైతం అవకాశం ఉండడంతో అన్నదాతలు నష్టపోయే ప్రమాదం ఉంది. బయట జరిగే విక్రయాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. అదీగాక మార్కెట్ యార్డులకు పంట ఉత్పత్తులను తీసుకురావాలంటే వారికి దూర భారం, సమయం వృథా తప్పేటట్లు లేదు.

గతంలో కమిటీ ఆధ్వర్యంలో కొనుగోళ్లు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 18 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటి ఆధ్వర్యంలోనే రైతులు వివిధ పంటలను విక్రయించేవారు. ఒక వేళ ప్రైవేట్ ట్రేడర్లు కొనుగోలు చేస్తే.. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఒక శాతం సెస్​రూపంలో వస్తుంది. ధాన్యం, మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు సర్కారు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొంటోంది. మినుములు, కందులు, శనగలు, సోయ సహకార సంఘాలతో పాటు వ్యవసాయ మార్కెట్లలో కొంటున్నారు. ఇటీవల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసేందుకు సీఎం కేసీఆర్ ​నిర్ణయం తీసుకున్నారు. దీంతో రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి.

అన్నదాతలకు తీవ్ర ఇబ్బందులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, వరి, సోయాబీన్, కందులు, శనగలు, మినుములు ఎక్కువగా పండిస్తారు. నిర్మల్, మంచిర్యాల జిల్లాలో వరి ఎక్కువగా పండగా.. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో పత్తి ఎక్కువగా పండుతుంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోయా ఎక్కువగా పండిస్తుంటారు. మొక్కజొన్న ఎక్కువగా నిర్మల్ జిల్లాలో సాగవుతుంది. ఇప్పటివరకు గ్రామాల్లోనే వివిధ పంటలు కొనుగోలు చేసేవారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. వానాకాలం పంటలకు సంబంధించి నిర్మల్ జిల్లాలో 80 వేల మెట్రిక్ టన్నులు.. మంచిర్యాల జిల్లాలో 40 వేల మెట్రిక్ టన్నులు, ఆసిఫాబాద్ జిల్లాలో 15,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే 90 శాతానికిపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. నిర్మల్ జిల్లాలో 132, మంచిర్యాల జిల్లాలో 115 కేంద్రాలను మూసివేశారు. ఇప్పటికే గ్రామాల్లో ధాన్యం అమ్మేందుకు రైతులు రోజుల తరబడి కేంద్రాల్లో నిరీక్షించాల్సి వస్తోంది. ప్రతి గ్రామంలో రెండు చొప్పున కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ, మరో కేంద్రం అవసరమవుతోంది. రైతులు 15 రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టి విక్రయిస్తున్నారు. తాజాగా కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లనుంది. చిన్న, సన్నకారు రైతులు వివిధ ప్రాంతాల్లోని మార్కెట్లకు వెళ్లి అమ్ముకునే పరిస్థితి లేదు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed