ఆ వృద్ధుడికి అదే చివరి బీడి.. రంగంలోకి దిగిన సీఐ

by  |
Sravan kumar
X

దిశ, జవహర్ నగర్: అలవాటులో పొరపాటు జరిగింది. క్షణకాలం ఏమరపాటు అతడి ప్రాణాలనే తీసింది. చిన్న నిప్పు రవ్వ ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. బీడి తాగుతూ.. దాని నిప్పు అంటుకుని ఓ వృద్ధుడు ప్రాణాలు వదిలాడు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను సీఐ భిక్షపతి రావు సోమవారం విలేఖరులకు వెల్లడించారు.

జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధి బాలాజీ నగర్‌లోని ఆనంద్ నగర్ కాలనీకి చెందిన కీర్తి శ్రావణ్ కుమార్ (70) భార్య, తన ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. ఆయన గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నారు. సోమవారం భార్య, కోడలు, కుమారులు పని మీద బయటకు వెళ్లారు. శ్రావణ్ కుమార్ ఇంట్లోనే ఉన్నాడు. అయితే బీడి తాగే అలవాటు ఉన్న శ్రావణ్ కుమార్.. ప్లాస్టిక్ చైర్లో కూర్చొని బీడీ సేవిస్తున్న క్రమంలో బీడి నుంచి నిప్పు రవ్వలు చైర్‌పై పడి మంటలు వ్యాపించాయి. దీంతో అనారోగ్యంతో ఉన్న ఆయన మంటల నుంచి తప్పించుకోలేక సజీవదహనం అయ్యాడు. ఆలస్యంగా గుర్తించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించామని సీఐ భిక్షపతి రావు తెలిపారు.



Next Story