భారత్‌బంద్‌కు మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు

by  |
భారత్‌బంద్‌కు మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 27న జరప తలపెట్టిన భారత బంద్ కు మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రజల ఆస్తులు, సహజ వనరులను దేశ విదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొస్తున్నదని, ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలు చేస్తున్నదని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలు రైతు వ్యతిరేకమైనవి మాత్రమే కాక ప్రజా వ్యతిరేకం, దేశద్రోహకరమైనవని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరంకుశ సాగు చట్టాలు అమల్లోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రైతాంగ ఉద్యమానికి సంఘీభావం తెలియజేయాల్సిందిగా, డిమాండ్ల సాధనకు స్వయంగా పాల్గొనాల్సిందిగా ప్రజలను కోరింది. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ పది నెలలుగా ఢిల్లీ నగర శివార్లలో నిరవధిక ధర్నా, నిరసన ప్రదర్శలు చేస్తున్న రైతులు మిలిటెంట్‌గా పోరాడుతున్నారని, వారి దీర్ఘకాలిక రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. రైతు ఉద్యమాన్ని అణచివేయడానికి బీజేపీ ప్రభుత్వం క్రూరమైన విధానాన్ని అమలుచేస్తున్నదని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను, ఆర్థిక సంస్కరణలను దూకుడుగా అమలుచేస్తున్నదని, దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నదని పేర్కొన్నారు.

Next Story

Most Viewed