ఆత్మహత్యా.. హత్యా..? కీలకంగా మారిన కుమారుడి వాంగ్మూలం

by  |
mystery is dead
X

దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం సృష్టించింది. భర్త మృతిపై భార్య ఓ విధంగా చెబుతుండగా.. వారి ఏడేళ్ల కుమారుడు మరోలా చెబుతుండటంతో అనుమానాలు బలపడుతున్నాయి. అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి సడన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం మిస్టరీగా మారింది. మృతుడి కుమారుడు, పోలీసుల కథనం ప్రకారం..

చెన్నుగారిపల్లెకు చెందిన నవీన్‌కుమార్‌ భార్య, కుమారుడితో కలిసి పాకాల శివశక్తి నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం రాత్రి భార్యభర్తల మధ్య వివాదం జరిగింది. దీంతో వెంటనే ఇంట్లోకి వెళ్లిన ఆయన తలుపులు బిగించుకొని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడ్డు. ఇంట్లోకి వెళ్లిన భర్త ఎంతకు తలుపు తీయకపోవడంతో కుమారుడుతో కలిసి భార్య పిలిచింది. అయినా లోపలి నుంచి స్పందన రాకపోవడంతో ఆమె వెంటనే తన మామ, బావకు సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చి తలుపులు పగలగొట్టి చూడగా.. నవీన్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉన్నాడు.

అయితే తండ్రి మరణంపై ఆయన ఏడేళ్ల కుమారుడి కథనం మరోలా ఉండటం గమనార్హం. ‘‘అమ్మానాన్న ఇద్దరు కొద్దిసేపు గొడవ పడ్డారు. ఆ సమయంలో పక్కింటి అంకుల్ వచ్చి నాన్నను కొట్టాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నాడు’’ అని పోలీసులకు తెలిపాడు. భార్య మాత్రం అతడే ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపింది. మరోవైపు మృతుడి తండ్రి మాత్రం ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పేర్కొన్నాడు. నవీన్ మృతిపై ముగ్గురు మూడు విధాలుగా చెబుతుండటంతో పోలీసులు తల పట్టుకున్నారు. అయితే మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. రిపోర్ట్ అనంతరం నవీన్ మృతిపై చిక్కుముడి విప్పుతామని తెలిపారు.



Next Story

Most Viewed