టీఆర్ఎస్ పార్టీని నేతన్నలు క్షమించరు : సురేశ్

by  |
టీఆర్ఎస్ పార్టీని నేతన్నలు క్షమించరు : సురేశ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్​ఎస్​ ప్రభుత్వం తెలంగాణ నేతన్నలను నట్టేట ముంచి కేంద్ర ప్రభుత్వ సాయం కోసం చేతులు చాచడం విడ్డూరంగా ఉందని నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ దాసు సురేశ్ విమర్శించారు. మంత్రి కేటీఆర్ పద్మశాలీయులను కేవలం ఓటు బ్యాంకుగా భావించారన్నారు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌ను తిరస్కరించినా బోధ పడడం లేదన్నారు. ఈ మేరుకు శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. చేనేత కార్మికులను పబ్లిసిటీకి వాడుకున్న ఘనత కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడేండ్ల కాలంలో నేతన్నలకు ప్రభుత్వం చేసిందేమిటో చర్చకు రావాలని మంత్రి కేటీఆర్‌కు సవాల్​ విసిరారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న 323 మంది నేత కార్మిక కుటుంబాలను మంత్రి కేటీఆర్ కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు.

నేతన్నలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ అనేక మార్లు ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్లను దాటి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేసినా వారి పట్ల సానుభూతి కూడా ప్రకటించలేదన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ షాపింగ్ మాల్‌లు చేనేత కార్మికుల శ్రమను దోచుకుంటూ నకిలీ చేనేత వస్త్రాలతో వినియోగదారులను మోసం చేస్తున్నా సంబంధిత మంత్రిగా కొనసాగుతున్న కేటీఆర్ కనీసం ఈ అంశంపై విచారణ కూడా కొనసాగించలేదన్నారు. కార్పొరేట్ వర్గాలతో కుమ్ముక్కయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం రెండుసార్లు రూ.1250 కోట్లు, రూ.1273 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్​ లో పెట్టారు. కానీ కనీసం పది శాతం కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. లాక్ డౌన్ కాలంలో దీక్షలు నిర్వహించిన పోచంపల్లి, చౌటుప్పల్, చండూరు ప్రాంత నేతన్నలకు ఇచ్చినన హామీలను నెరవేర్చలేదని, పేరుకుపోయిన చేనేత వస్త్ర నిల్వలను ఇప్పటికీ ప్రభుత్వం ఖరీదు చేయక పోవడంతో ఘననీయంగా నేతన్నల కూలీ రేట్లు తగ్గినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

నేతన్నలకు రూ.5లక్షల ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందజేస్తామని సిరిసిల్ల వేదికగా 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చెప్పిన మంత్రి కేటీఆర్ మూడేండ్లైనా ఈ పథకాన్ని ఆరంభించలేదన్నారు. నేతన్నలకు రైతుల వలె పెట్టుబడి సాయం, కూలీ రేట్లు పెంచడం, త్రిఫ్టు ఫండ్​ పథకం కొనసాగింపు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వడం లాంటి అనేక ప్రతిపాదనలు మంత్రికి విన్నవించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. మూడేండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ మద్దతు లేకుండా శంకుస్థాపన చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పనులు స్తంభించడం వల్ల తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస పోయిన రెండు లక్షల పైచిలుకు నేతన్నల ఆశలపై తెలంగాణ ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. నేత కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే విధంగా తదుపరి కార్యాచరణను కొనసాగిస్తామన్నారు.



Next Story

Most Viewed