తెలంగాణలో బాగుపడింది వాళ్ల కుటుంబం మాత్రమే : వైయస్ షర్మిల

by  |
తెలంగాణలో బాగుపడింది వాళ్ల కుటుంబం మాత్రమే : వైయస్ షర్మిల
X

దిశ, డిండి: తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం తప్ప ఏ కుటుంబమూ బాగు పడలేదని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు. ఉద్యోగాల భర్తీకి సమగ్ర నోటిఫికేషన్ సాధించడమే లక్ష్యంగా చేపట్టిన నిరుద్యోగుల నిరాహార దీక్ష మంగళవారం చింతపల్లి మండలంలోని కుర్మేడు గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య రాష్ట్రంలో కేసీఆర్ నియంతలా అరాచక పాలన చేస్తున్నారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులు చనిపోతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ మాత్రం తమకేమీ పట్టనట్లుగా ఫామ్ హౌస్ లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా పార్లమెంటరీ కన్వీనర్ పిట్ట రామ్ రెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ అంటే వైయస్సార్ కు అమితమైన ప్రేమని, అందుకే సీఎంగా ఉన్నప్పుడు 30 సార్లు మన జిల్లాకు వచ్చారని అన్నారు. డిండి, నక్కలగండి ప్రాజెక్టులు వైయస్సార్ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. ఆయన స్వర్గస్తులైన తర్వాత తట్టెడు మట్టి తీసిన నాయకులు లేరని ఆరోపించారు.

కేసీఆర్ పాలన బాగుంటే వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టవలసిన అవసరం ఉండేది కాదనీ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ చేస్తామన్న సీఎం కేసీఆర్ తన ఇంటినే బంగారు మయంగా మార్చుకున్నారని ఆరోపించారు.

హుజూరాబాద్‌‌లో ఈటల గెలుపు.. హరీష్‌ రావుకు కేటీఆర్ అభినందనలు

Next Story

Most Viewed