టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసులు!

by  |
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసులు!
X

తెలంగాణ ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారు దాఖలు చేసిన వివరాలను ఆధారం చేసుకుని ఆదాయపు పన్ను శాఖ పంజా విసురుతోంది. అనూహ్యంగా ఆదాయం ఎలా పెరిగిందో చెప్పాలంటూ నోటీసులు జారీ చేస్తోంది. దీంతో అధికార పార్టీ శాసనసభ్యులు కలవరపడుతున్నారు. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్రంతో రాజీపడేది లేదని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ కావడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు జారీ అవుతున్నాయి. ఇప్పటికే సుమారు పాతిక మంది నోటీసులు అందుకున్నారని ఢిల్లీవర్గాల సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేటపుడు నామినేషన్‌తోపాటు సమర్పించిన అఫిడవిట్‌లోని వివరాలకు, అప్పటివరకు దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌ లకు మధ్య కొన్ని తేడాలు ఉన్నాయని, వీటిపై క్లారిఫికేషన్ కోసం మాత్రమే నోటీసులు జారీ చేశామని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ రాష్ట్రంలో ఇది సహజంగా జరిగే ప్రక్రియేనని, ప్రాధాన్యం ఏమీ లేదని అంటున్నాయి. ఈ నోటీసులు వచ్చినవారి గుండెల్లో మాత్రం గుబులు పుడుతోంది. ఇంకెంతమందికి అందుతాయోనని కలవరం చెందుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడిగా ఉన్న సమయంలో ఈ నోటీసులు జారీ కావడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీతో అమీతుమీ తేల్చుకోడానికి సిద్ధమవుతుండడం, బీజేపీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయడానికి హైదరాబాద్ నుంచే శ్రీకారం చుడతానని ప్రకటించిన నేపథ్యంలో ఐటీ నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంతో ఘర్షణపూరిత వైఖరి నెలకొన్న కారణంగానే ఈ చికాకులు మొదలయ్యాయని, ఇది చివరకు ఎక్కడకు దారితీస్తుందోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.

బయటకు పొక్కకుండా

ఖమ్మం జిల్లాలోని ఒక ఎస్టీ ఎమ్మెల్యేకు ఈ తరహా నోటీసు అందినట్లు ఐటీ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన మాత్రం ఇంకా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ‘దిశ’కు స్పష్టం చేశారు. కొద్దిమంది విషయంలో మాత్రం 2014 అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసేనాటికి అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలకు, 2018 అఫిడవిట్‌లోని వివరాలకు మధ్య చాలా పెరుగుదల ఉందని సమాచారం. దాని విషయంలో వారి నుంచే స్పష్టంగా వివరణ కోరుతూ ఈ నోటీసులు జారీ చేశారని తెలిసింది. ఆ నోటీసుల్లో ఇంకా ఏమేం వివరాలు ఉన్నాయనేది వెల్లడి కావాల్సి ఉంది. గతేడాది మే నెలలో సైతం కొద్దిమందికి ఇదే తరహా నోటీసులు జారీ అయ్యాయి. నాలుగేళ్ల వ్యవధిలోనే ఆస్తులు అనూహ్యంగా పెరగడాన్ని ఐటీ అధికారులు ప్రశ్నించారు. 2014 నాటి అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్, 2018 ఎన్నికల అఫిడవిట్‌లలోని ఆస్తుల వివరాలను పోల్చి ఈ నోటీసులు జారీ చేశారు. దీనికి తోడు 2018 అఫిడవిట్‌లో పేర్కొన్న గణాంకాలకు ఐటీ గణాంకాలకు మధ్య ఉన్న తేడా కూడా ఐటీ అధికారుల కన్ను పడడానికి మరో కారణం. నాలుగేళ్ల వ్యవధిలో పది శాతానికి పైగా ఎక్కువ సంపదను పోగేసుకున్నట్లు తేలినవారికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. నాలుగేళ్లకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ సహా పలువురి ఎమ్మెల్యేల ఆస్తులు గణనీయంగా పెరిగాయి. ఈసారి నోటీసులు జారీ అయినవారిలో ఎవరెవరున్నారనే విషయాన్ని ఐటీ వర్గాలు అధికారికంగా వెల్లడించలేదు. వాటిని అందుకున్నవారు కూడా బైటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే రాజకీయంగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో అప్‌సెట్‌గా ఉన్న అధికార పార్టీ నేతలకు ఇప్పుడు ఐటీ నుంచి కూడా నోటీసులు జారీ కావడం ఆందోళనకు గురిచేస్తోంది.



Next Story

Most Viewed