నైట్ కర్ఫ్యూపై 45 నిమిషాల్లో తేల్చండి.. ప్రభుత్వానికి హైకోర్టు డెడ్ లైన్

by  |
నైట్ కర్ఫ్యూపై 45 నిమిషాల్లో తేల్చండి.. ప్రభుత్వానికి హైకోర్టు డెడ్ లైన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి 24 గంటల గడువు ఇచ్చినా నైట్ కర్ఫ్యూ విషయంలో తేల్చకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమెందుకని మండిపడింది. నైట్ కర్ఫ్యూ గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగిసిపోతోందని, దీన్ని కొనసాగించడం లేదా ఇతర విధాన నిర్ణయంపై 45 నిమిషాల్లో తేల్చేయాలని లేకుంటే కోర్టే నిర్ణయం తీసుకుంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ విజయసేన్‌రెడ్డిలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.

ప్రభుత్వం నిర్ణయం తీసుకోడానికి ఒక రోజు గడువు సరిపోలేదా అని అడ్వొకేట్ జనరల్‌ను బెంచ్ నిలదీసింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ బదులిస్తూ, ప్రధాన కార్యదర్శి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారని, నైట్ కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చారు. శనివారం ఉదయం ఐదు గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉందని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి మీటింగులో ఉన్నందున 45 నిమిషాలు డెడ్‌లైన్ విధిస్తున్నామని, అప్పటికల్లా తేల్చివేయకపోతే కోర్టే నిర్ణయాన్ని వెల్లడిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం న్యాయస్థానాలకు ఇష్టం లేదని, అయినా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోలేమని హెచ్చరించింది.

Next Story

Most Viewed