‘గల్ఫ్ కార్మికుల పొట్ట కొట్టేలా కేంద్ర సర్క్యూలర్’

by  |
Gulf JAC
X

దిశ, తెలంగాణ బ్యూరో: గల్ఫ్ దేశాల్లో పనిచేసే కార్మికుల కనీస వేతనాలను తగ్గిస్తూ కేంద్రం ఇచ్చిన సర్క్యూలర్‌ను వెంటనే రద్దు చేయాలని గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్సన్ కమిటీ కేంద్రాన్ని కోరింది. తమ గోడును వినిపించేందుకు శనివారం 8 మంది జేఏసీ సభ్యుల బృందం మంచిర్యాల నుంచి రైలులో ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ రవిగౌడ్ మాట్లాడుతూ.. గల్ఫ్ కార్మికుల సమస్యలపై కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదన్నారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నందున ఢిల్లీలో తొమ్మిది మంది ఎంపీలను కలిసి తమ గోడును విన్నవిస్తామన్నారు. ఈ సర్క్యూలర్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో ఉన్న 88 లక్షల మంది భారతీయ కార్మికులు, ఉద్యోగులపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ కారణంగా ప్రతి ఒక్క కార్మికుడికీ రూ.15వేల జీతం మాత్రమే వస్తుందని, దీంతో మరింత పేదరికంలోకి జారిపోతామన్నారు. సర్క్యూలర్‌ను రద్దు చేసి, పాత వేతనాలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. గల్ఫ్ జేఏసీ ఖతార్ ప్రతినిధి తోట ధర్మేందర్ మాట్లాడుతూ.. ఖతార్ ప్రభుత్వం అన్ని దేశాల కార్మికులకు 1,000 రియాళ్ళ కనీస వేతనం, భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని చట్టం చేసిందని, కానీ భారత ప్రభుత్వం తమ కార్మికులను 728 రియాళ్లకే (200 డాలర్లు) పంపిస్తామని చెప్పడం ఘోరమని అన్నారు.


Next Story

Most Viewed