డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై దద్దరిల్లిన గ్రామసభ.. జాబితాలో అర్హులకు దక్కని చోటు.. 

by  |
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై దద్దరిల్లిన గ్రామసభ.. జాబితాలో అర్హులకు దక్కని చోటు.. 
X

దిశ, కీసర: శుక్రవారం కీసర గ్రామసభలో డబల్ బెడ్‌రూమ్ ఇళ్ల పై గ్రామస్తులు అధికారులను నిలదీశారు. గ్రామ సర్పంచ్ మాధురి వెంకటేష్ అధ్యక్షతన కీసర గ్రామ పంచాయతీ ఎదుట గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కి సంబంధించిన జాబితాను ప్రజల ముందు ఉంచారు. అందులో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. మీ సేవలో డబల్ బెడ్ రూమ్‌ల కొరకు దరఖాస్తు చేసుకున్న తమపై ఎటువంటి విచారణ జరపకుండా అనర్హులుగా ఎలా ప్రకటిస్తారని దుయ్యబట్టారు. కీసరలో నిర్మించిన 48 డబుల్ బెడ్‌రుమ్‌లకు గాను 252 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు తహశీల్దార్ గౌరీ పేర్కొన్నారు.

గ్రామస్తులు మాట్లాడుతూ.. స్థానికులకే డబుల్ బెడ్ ఇండ్లు కేటాయించిన తర్వాత వలస వచ్చిన వారికి కేటాయించాలని అన్నారు. తమ తాతల కాలం నుండి కీసర గ్రామంలో నివసిస్తూ సొంత ఇల్లు లేకుండా కిరాయి ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నామన్నారు. అలాంటి తమకు ఇళ్ల కేటాయించకుండా వలసదారులకు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని అధికారులను నిలదీశారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని అర్హులకు కేటాయించడం లేదని ఆరోపించారు.

తహశీల్దార్ గౌరీ మాట్లాడుతూ.. ఏమైనా అభ్యంతరాలు ఉంటే రెండు రోజుల్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే తగిన విచారణ చేసి అర్హులైన వారికి ఇళ్లు కేటాయిస్తామని తహశీల్దార్ గౌరీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధురి వెంకటేష్, తహశీల్దార్ గౌరీ వత్సల, వైస్ ఎంపీపీ జలాల్పురం సత్తిరెడ్డి, ఎంపీటీసీ నారాయణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు, వార్డు సభ్యులు, పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed