అప్పటివరకూ ధాన్యం బాధ్యత రైతులదే : కలెక్టర్ శర్మన్

by  |
Collector Sharman
X

దిశ, నాగర్ కర్నూల్: రైతులు కష్టపడి పండించిన పంటను మిల్లులకు తరలించే వరకు వరి ధాన్యాన్ని కాపాడుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ రైతులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కొల్లాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడారు… జిల్లాలో అకాల వర్షాల పడుతున్నందున ధాన్యం తడిసిపోకుండా ఉండేలా జాగ్రత్తలు చేపట్టాలని కొల్లాపూర్ పీఏసీఎస్ చైర్మన్‌కు సూచించారు. టార్ఫాలిన్లు, గన్నీ బ్యాగులు తగినన్ని ఉన్నాయా? లేవా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ పంటను వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ శర్మన్‌కు వివరించారు.

జిల్లాలో ఉన్న మిల్లులకు వాటి సామర్థ్యాలకు మించి ఇదివరకే అప్పగించడం జరిగిందని, మిల్లుల్లో ఉన్న వరి ధాన్యం నిల్వలను వివరించారు. సమస్యలను వీలైనంత త్వరగానే పరిష్కరించి మిల్లులకు వరి ధాన్యాన్ని తరలించేలా చేస్తామని రైతులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. అప్పటివరకు సమీపంలోని పాఠశాలలు రైతు వేదికలలో నిల్వ ఉంచి ధాన్యాన్ని కాపాడుకోవాలని రైతులకు కలెక్టర్ సూచించారు. ఇప్పటివరకు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం నుండి 35 వేల బస్తాల వరి ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు సింగిల్విండో చైర్మన్ కలెక్టర్‌కు తెలిపారు. అనంతరం రైతుల సమస్యలను పరిష్కరించేందుకు నాగర్ కర్నూలు మండల పరిధిలోని గుడిపల్లి బాయిల్డ్ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మిల్లు యజమానితో ధాన్యం తరలింపు గురించి కలెక్టర్ మాట్లాడారు. 24 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మిల్లింగ్ సమర్ధత కాగా, ఇప్పటివరకు మిల్లులో నిల్వ ఉన్న 16 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. 30 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచుకోవాలని యజమానికి సూచించారు. అవసరమైతే గోదాములను ఏర్పాటు చేసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లాలోని రైతుల ఇబ్బందులను గుర్తించి మిల్లుల సామర్ధ్యాలను మిల్లర్లు పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ శర్మన్ ఈ సందర్భంగా కోరారు.

Next Story

Most Viewed