నర్సులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.. స్టైఫండ్ భారీగా పెంపు

by  |
Nurses
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా నర్సులకు ప్రస్తుతం ఇస్తున్న స్టైఫండ్‌ను తక్షణం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నర్సింగ్ కోర్సు చేస్తున్న మేల్, ఫిమేల్ ఫస్టియర్ విద్యార్థులకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 1,500 స్టైఫండ్‌‌ను రూ. 5,000కు, సెకండియర్ విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న రూ. 1,700 ను రూ. 6,000కు, ఫైనలియర్ విద్యార్థులకు రూ. 1,900 నుంచి రూ. 7,000కు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

వెంటనే ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డిని ఆదేశించారు. దీర్ఘకాలంగా నర్సులు స్టయిఫండ్ పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారని, చాలీచాలని స్టయిఫండ్‌తో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నందున వెంటనే దాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.

సిరిసిల్లలోని నర్సింగ్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. కరోనా సమయంలో తల్లిదండ్రులను కన్న కొడుకులే ఇంట్లోకి రానివ్వని సమయంలో ఆస్పత్రిలో బిడ్డల కంటే ఎక్కువ ప్రేమతో చికిత్స అందించిన నర్సుల సేవలను మరువలేమని అభినందించారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు సైతం ఇంటింటికీ వెళ్ళి జ్వర సర్వే చేసి కరోనా మెడికల్ కిట్లను అందించారని కొనియాడారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ఉన్నాయని, కొత్తగా మరో 13 వస్తున్నాయని, ఇందులో చదివే విద్యార్థులందరికీ స్టయిఫండ్ పెరుగుతుందని స్పష్టం చేశారు.

Next Story