లాక్‌డౌన్ వేళ.. ఏదీ ‘చెత్త’శుద్ధి!

by  |
లాక్‌డౌన్ వేళ.. ఏదీ ‘చెత్త’శుద్ధి!
X

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్‌తో చెత్త ఉత్పత్తి తగ్గిపోయింది.. రోడ్లన్నీ పరిశుభ్రంగా కనిపిస్తాయనుకున్న జీహెచ్ఎంసీ, స్వచ్ఛ హైదరాబాద్ బృందాలకు నిరాశే మిగిలింది. సాధారణ రోజుల కంటే ఇప్పుడే ఎక్కువ ఓపెన్ గార్బేజ్ ప్రదేశాలు కనిపిస్తున్నాయి. కరోనా నివారణ చర్యలతోపాటు ఇంటి వద్ద నుంచి చెత్త సేకరించే పనిని బల్దియా శానిటేషన్ విభాగం చేపడుతోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వని ఈ పరిస్థితుల్లో కూడా ప్రజలు రోడ్ల మీద చెత్తను కుప్పలుగా పోస్తుండటం గమనార్హం. కరోనా నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. నగరంలో రోడ్లు, వీధుల్లో చెత్త కనిపించకుండా ఇంటి నుంచే దానిని సేకరించే పనిని బల్దియా కొన్నేండ్ల క్రితం చేపట్టింది. రోడ్ల మీద చెత్త, వ్యర్థాలు వేయకుండా బహిరంగ చెత్త బుట్టలను కూడా ఏర్పాటు చేసింది. అయినా కొందరిలో మార్పు కనిపించడంలేదు. రోడ్ల మీదనే చెత్త వేయడంతోపాటు నివాసాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాలను చెత్త కుప్పలుగా మార్చేశారు. దీంతో బల్దియా అధికారులు ఓపెన్ గార్బేజ్ పాయింట్లను గుర్తించి వాటిని తొలగించేందుకు ప్రణాళికబద్ధంగా పనిచేశారు.

మళ్లీ ఊపిరి పోసుకుంటున్నాయి..

నగర వ్యాప్తంగా 1,116 ప్రాంతాల్లో ఓపెన్ గార్బేజ్ పాయింట్లను జీహెచ్ఎంసీ గుర్తించింది. వీటి తరలింపునకు శానిటేషన్ విభాగంలో ఉన్న 700 వాహనాలకు అదనంగా సర్కిల్‌కు నాలుగు మినీ టిప్పర్లు, రెండు బాబ్‌కాట్‌లను కేటాయించింది. గార్బేజ్ పాయింట్లలో ముగ్గులు వేయించడం, అందంగా తీర్చిదిద్దడం వంటి చేపట్టారు. సిబ్బందిని ఏర్పాటు చేసి… అక్కడ చెత్త వేసేందుకు వచ్చేవారికి అవగాహన కూడా కల్పించారు. గతేడాది చేపట్టిన ఈ ప్రయోగానికి మంచి స్పందనే లభించింది. అయితే, ఈ లాక్‌డౌన్ రోజుల్లో ప్రజలు ఏ రాత్రి, ఏ సమయంలో చెత్త వేస్తున్నారోగానీ ఓపెన్ గార్బేజ్‌ పొట్ట నిండా చెత్త నిండిపోయింది.

తగ్గిన 1,500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి

జీహెచ్ఎంసీ పరిధిలో గతంలో ప్రతీరోజు ఏడు వేల మెట్రిక్ టన్నుల చెత్త వ్యర్థాలు వెలువడగా.. లాక్‌డౌన్ రోజుల్లో 1,500 మెట్రిక్ టన్నులు తగ్గినట్టు శానిటేషన్ అధికారులు చెబుతున్నారు. ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తిస్తుండటం, సీజనల్ వ్యాధుల కాలం సమీపిస్తుండటంతో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అధికారులు సూచిస్తున్నారు. రోడ్లపైన వేయకుండా చెత్త డబ్బాలను ఉపయోగించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని
వారు కోరుతున్నారు.

Tags: Lockdown, GHMC, sanitation, swachh hyderabad, public

Next Story

Most Viewed