గాయకుడిగా తొలిపాట ఇలా..

by  |
గాయకుడిగా తొలిపాట ఇలా..
X

దిశ, వెబ్‌డెస్క్: పాటకు ప్రాణం పోసిన ఎస్పీ బాలు స్వర ప్రస్థానం 1964లోనే మొదలైంది. తొలిసారిగా 1964లో మద్రాస్‌ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటిల్లో పాల్గొన్న బాలు.. మొదటి బహుమతి పొందాడు. ఆ మొదటి బహుమతే ఆయనను ఉన్నత శిఖరాలకు చేర్చింది.

అదే సంగీత కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ప్రఖ్యాత సంగీత దర్శకులు త్రిమూర్తులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు ఉండటం విశేషమైతే.. ప్రేక్షకుల మధ్య కూర్చొని బాలు స్వరాన్ని ఆలకించిన మ్యూజిక్ డైరెక్టర్ కోదండపాణి ఎంతో ఆకర్షితుడయ్యాడు. అదే సభలో బాలుకు సినిమాలో పాడే అవకాశం ఇస్తానని మాటిచ్చాడు కోదండపాణి.

అయితే, మద్రాస్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న బాలు.. తరచూ కోదండపాణిని కలుస్తూ ఉండేవారు. ఒకే టేక్‌లో పాటను కంప్లీట్ చేసే బాలు ప్రతిభను గమనించిన కోదండపాణి ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’లో అవకాశం ఇచ్చాడు. ‘ఏమి వింత మొహం’ అన్న పాటను వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేసిన బాలు.. అది నలుగురి కలిసి పాడేదని తెలిసింది. దీంతో పి. సుశీల, రాఘురామయ్య, పి.బి. శ్రీనివాస్‌తో కలిసి బాలు సినిమాలో తొలి పాట పాడారు.

మద్రాస్‌లోని విజయా గార్డెన్స్‌లో 1966 డిసెంబర్ 15న రికార్డు అయిన ఈ పాట మొదటి టేక్‌లోనే ఓకే కావడం గమనార్హం. ఆ తర్వాత 1967 జూన్ 2న విడుదల అయిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ సినిమాతో బాలు స్వరం జనాల్లో మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత ఎస్పీ బాలు ఎక్కడా కూడా వెనక్కి తిరిగి చూసే అవకాశం లేకుండా.. ఉన్నత శిఖరాలను చేరారు. ఇంతటీ మహానుభావుడు ఈ రోజు మన మధ్యన లేకపోవడం నిజంగా బాధాకరం.


Next Story

Most Viewed