వ్యాక్సినేషన్ మొదటి డోస్100 శాతం కంప్లీట్.. వారిని అభినందించిన మంత్రి

by  |
వ్యాక్సినేషన్ మొదటి డోస్100 శాతం కంప్లీట్..  వారిని అభినందించిన మంత్రి
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: యావత్ దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నివారణ చర్యలకు అందిస్తున్న వ్యాక్సినేషన్ మొదటి డోస్ ఖమ్మం జిల్లాలో వందశాతం పూర్తిచేసిన జిల్లా యంత్రాంగాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ మొదటి డోస్ పూర్తిస్థాయిలో అందించిన సందర్భంగా జడ్పీ హాల్లో నిర్వహించిన అభినందన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

మొదటి డోస్ వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడానికి గ్రామస్థాయి నుంచి నగరాల వరకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పని చేశారన్నారు. వారి సహకారంతోనే వ్యాక్సినేషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తయిందని కితాబిచ్చారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జిల్లా యంత్రాంగం, సిబ్బంది సాహసోపేతంగా పని చేశారని గుర్తు చేశారు. రెండో డోసు వేయించుకోవాల్సిన వారు నిర్ణీత సమయానికల్లా వేయించుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న వేళ రెండో డోసు అంద‌రూ త‌ప్పకుండా వేయించుకోవాల‌ని, బూస్టర్ డోస్ కూడా త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. ప్రజలకు కరోనా టీకాలు వేయటంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

సోషల్ డిస్టెన్స్‌తో పాటు ప్రతి ఒక్కరు మాస్కులు తప్పక ధరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్స్‌కు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమంలో కూడా ఖమ్మం జిల్లానే ముందంజలో నిలిచిందన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ఖమ్మం జిల్లా ప్రజలకు తమ సేవలను అందించిన వైద్యాధికారులు, సిబ్బంది, పంచాయతీ, అంగన్వాడీ, మున్సిపల్ తదితర శాఖ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు.

మహమ్మారిని ఎదుర్కోగలిగాం..

సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో అతి తక్కువ నష్టంతో ఈ మహమ్మారిని ఎదుర్కోగలిగామన్నారు.

పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక శాతం మందికి టీకాలు వేసిన రాష్ట్రం తెలంగాణనే అన్నారు. సహజంగా టీకాలు వేసుకోవడానికి ప్రజలు ఆస్పత్రులకు వస్తారు.. కానీ మన రాష్ట్రంలో ప్రజల వద్దకే టీకాలు తీసుకెళ్లి అందించామన్నారు. ఇంటింటికీ తిరగడం‌తో పాటు, పని ప్రదేశాల్లో ప్రత్యేక క్యాంపులు పెట్టి ప్రజలను ఒప్పించి టీకాలు వేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో శుక్రవారం నాటికి మొదటి డోస్‌ 99.35 శాతానికిపైగా వేయగా, 63.40 శాతం మందికి రెండో డోస్‌లు అందించడం పట్ల మంత్రి పువ్వాడ హర్షం వ్యక్తం చేశారు. 100% వ్యాక్సిన్ పూర్తి చేసిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం పలువురు ఉత్తమ సిబ్బందిని శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ పునుకొల్లు నీరజ, సూడా చైర్మన్ విజయ్, జిల్లా కలెక్టర్ వీపీగౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఎంహెచ్ఓ మాలతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed