దయచేసి పన్ను కట్టించుకోండి.. కమిషనర్ ఎదుట కంటతడి పెట్టి వికలాంగుడు

by  |
disabled
X

దిశ, హన్మకొండ టౌన్: ‘మున్సిపల్ కమిషనర్ గారు వికలాంగుడనైన నాకు ఇంటి పన్ను, నల్లా పన్ను కట్టడానికి అనుమతి ఇవ్వండి.’ అంటూ సోమవారం గ్రీవెన్స్ సెల్‌లో ఓ వికలాంగుడు అడిషనల్ కమిషనర్‌ విజయలక్ష్మి ఎదుట తన గోడును వెల్లబోసుకున్నాడు. మున్సిపల్ అధికారులు కబ్జా దారులతో మిలాఖతై వరంగల్ కాశిబుగ్గలో 2012 నుండి నేటి వరకు మా ఇంటి పన్ను స్వీకరించకుండా నిలిపివేశారని వికలాంగుడైన సయ్యద్ అసాద్ సోమవారం వాపోయాడు. దీనిపై లెక్కలేనన్ని సార్లు మున్సిపల్ అధికార్లకు ఫిర్యాదు చేశారని, అయినా పట్టించుకోవడం లేదని అన్నారు. వికలాంగుడనైన తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అధికారుల ఎదుట కంటతడి పెట్టుకున్నాడు.

దీనిపై ‘కుడా’ అధికారులకు సైతం లిఖిత పూర్వకంగా తెలియజేశామని అన్నారు. వారు సర్వే చేస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా తనకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ఇళ్లు, ఇంటి పక్కన ఉన్న స్థలం రెండు మాకు సంబంధించినవే అని, ‘కుడా’కు ఏమాత్రం సంబంధం లేదని మూడేండ్ల కిందనే ఇరవై పేజీల తీర్పు ఇచ్చి కోర్టు కుండ బద్దలు కొట్టినా, కోర్టు ఆర్డర్ కాపీని సైతం లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇందులో కాశిబుగ్గ ఏరియా డిప్యూటీ కమిషనర్ మరియు రెవెన్యూ ఇన్స్ పెక్టర్‌లే ప్రధాన పాత్రదారులుగా ఉన్నారని, తమకు సమస్య పరిష్కారం చేసేది కూడా వాళ్లే కాబట్టి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని వాపోయాడు. ‘దయచేసి మా కాశిబుగ్గ కాలనీ భూ ఆక్రమణ దారుల కొమ్ముగాయకుండా ఈ వినతి పత్రంతోనైన నా సమస్యకు ముగింపు పలికి ఇంటిపన్ను, నల్లాపన్ను కట్టడానికి అనుమతి ఇవ్వాలి’ అని వినతిపత్రంలో కోరాడు.


Next Story