లంచం.. లంచం.. ఓపిక నశించిన దంపతులు ఏం చేశారంటే..?

by  |
లంచం.. లంచం..  ఓపిక నశించిన దంపతులు ఏం చేశారంటే..?
X

దిశ ప్రతినిధి, మెదక్ : సర్కారు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఏసీబీకి ఎంత మంది అధికారులు పట్టుబడ్డా.. అధికారుల తీరులో మార్పు రావడం లేదు. అధికారుల నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణంతో భూములకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ఎకరా రూ.5 లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.40 లక్షలు పలుకుతోంది. దీంతో భూమిని కాపాడుకునేందుకు రైతులు చాలా కష్టపడుతున్నారు. సెంట్ భూమిని కుడా వదలడం లేదు. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ లో చెక్ చేసుకుంటూ తప్పు జరిగినా, వారి భూమి వేరే వారి పేరు మీదికి ఎక్కినా.. వెంటనే తహసీల్దార్ కార్యాలయంకి వెళ్తున్నారు.

రైతుల అవసరాలను ఆసరాగా చేసుకున్న రెవెన్యూ అధికారులు రికార్డుల్లో మార్పులు, డిజిటల్ సంతకాలు, సర్వేలు, తదితర సమస్యల కోసం చేతులు చాపుతున్నారు. లంచం ఇవ్వనిదే పని కాదంటూ తేలికగా చెబుతున్నారు. పైసలు ఇవ్వని వారిని నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. అయినా పని జరుగుతుందన్న నమ్మకం లేదు. ఇటీవల సిద్దిపేటలో ఇలాంటి సంఘటనలు ఒకట్రెండు చోటు చేసుకున్నాయి. అయినా అధికారులు తమ తీరు మార్చుకోవడం లేదు. తాజాగా సిద్దిపేట జిల్లా కొండపాక తహశీల్దార్ కార్యాలయంలో అధికారుల తీరుకు నిరసనగా దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.

ఒంటిపై కిరోసిన్…

తహసీల్దార్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల విసిగిపోయిన రైతు దంపతులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా కొండపాక మండల తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మీ, యాదయ్య దంపతులు. వీరికి ఉన్న 22 గుంటల భూమి అధికారుల నిర్లక్ష్యంతో వేరే వారికి భూ మార్పిడి చేయడంతో గత కొన్ని నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా తమ భూసమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కోర్టును ఆశ్రయించమని అధికారులు చెబుతున్నారని లక్ష్మి, యాదయ్య దంపతులు వాపోతున్నారు.

స్థలానికి సంబంధించి వేరే వారికి ఎలాంటి ఆధారాలు లేవని, తమ వద్ద భూమికి సంబంధించిన వివరాలు ఉన్నా మాకు సరైన న్యాయం చేయకపోగా, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారే కానీ మా భూసమస్య తీర్చడం లేదంటూ ఆవేదనతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్నారని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకోవాలని, సమస్య పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చిన వారికి వెంటనే న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

Next Story

Most Viewed