నేను కూడా గ్రామాల్లో పల్లెనిద్ర చేస్తా : కలెక్టర్ శర్మన్

by  |
Nagar Kurnool Collector Sharman
X

దిశ, నాగర్ కర్నూల్: ముఖ్యమంత్రి కేసీఆర్ దీర్ఘకాలిక విజన్‌తో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో సమాజానికి అవసరమైన పండ్లు, ఇతర ఫలాల మొక్కలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. జూలై 1 నుంచి చేప‌ట్టనున్న ఏడో విడత హరితహారం, పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలపై మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీడీలతో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మను చౌదరితో కలిసి జిల్లా కలెక్టర్ శర్మన్ సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జులై 1వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే అన్ని కార్యక్రమాలను పక్కా ప్రణాళికతో నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి పనులకు అవసరమైన ఉపాధి హామీ నిధులు విడుదల అయ్యాయని కలెక్టర్ తెలిపారు.

పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో నిర్దేశించిన పనులు ఏవైనా పెండింగ్‌లో ఉంటే చర్యలు తీసుకుంటామని అన్నారు. పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, నర్సరీలు తడి,పొడి చెత్త ఏర్పాటు షెడ్లు, డంపింగ్ యార్డులను అధికారులు పరిశీలించి వెంటనే వాటి ఫోటోలను సమర్పించాలన్నారు. మండల స్థాయి అధికారులు గ్రామాలను పర్యవేక్షిస్తూ పదిరోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో ప్రతి గ్రామంలో పచ్చదనం పారిశుధ్యంపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికారులు తమ మండలాలలోని గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించి సమస్యలు గుర్తించాలని, తాను కూడా పలు గ్రామాల్లో పల్లెనిద్ర చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఏ స్థాయి అధికారి అయినా అలసత్వం వహించకుండా పల్లెల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు. అంతేగాకుండా.. జిల్లాలో జూలై 1 నుంచి చేపట్టనున్న ఏడో విడత హరితహారం కార్యక్రమంలో కోటి మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శర్మన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ నర్సింగ్ రావు, డీపీఓ రాజేశ్వరి, సీఈఓ ఉష, డీఈవో గోవిందరాజులు, ఇతర జిల్లాస్థాయి మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed