కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్లు ఏమైనయ్ ?

by  |
కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్లు ఏమైనయ్ ?
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడిపై ప్రభుత్వం చెప్తున్న మాటలు, కనిపిస్తున్న ఆచరణ పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. కేంద్ర వైద్య బృందాల మొదలు రాష్ట్ర హైకోర్టు వరకు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యవహారంపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు స్వయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వివరణతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా తయారైంది. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 1400 వెంటిలేటర్లను అందజేసినట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. కానీ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం దాదాపు 750 వరకూ వచ్చి ఉండొచ్చు అని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం మాత్రం పాతవి, కొత్తవి కలిపి మొత్తం 1117 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటోంది. ఇందులో ఏది నిజమో ఇచ్చిన ప్రభుత్వానికి, తీసుకున్న ప్రభుత్వానికే ఎరుక.

కరోనా పరిస్థితుల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, వెంటిలేటర్లు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు వచ్చాయో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడించలేదు. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం తన స్వంత వనరులతో ఎన్ని కొనుగోలు చేసిందో తెలియదు. వివిధ కార్పొరేట్ సంస్థల నుంచి, ఎన్జీవోల నుంచి, వ్యక్తుల నుంచి ఇవి విరాళంగా ఎన్ని వచ్చాయో తెలియదు. ఒకవైపు గాంధీ, ఛెస్ట్, ఉస్మానియా జనరల్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, మెడికల్ సిబ్బంది తగినంతగా పీపీఈ కిట్లు అందడంలేదని, నాణ్యత సరిగా లేవని, ప్లాస్టిక్ కవర్ తరహాలో ఉన్నాయని పదేపదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవసరాలకు తగినంతగా పుష్కలంగా ఉన్నాయని మంత్రి, అధికారులు చెప్తున్నారు. కానీ గణాంకాలు మాత్రం వెలుగులోకి రాలేదు.

ఆర్టీఐ ద్వారా బహిర్గతం

రాష్ట్రానికి కేంద్రం నుంచి 1400 వెంటిలేటర్లు, 10.09 లక్షల ఎన్-95 మాస్కులు, 2.41 లక్షల పీపీఈ కిట్లు, 42.50 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను ఇచ్చినట్లు సమాచార హక్కు చట్టం కింద రాష్ట్రానికి చెందిన జలగం సుధీర్ దాఖలు చేసిన దరఖాస్తుకు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ బదులిచ్చింది. జూలై 28వ తేదీ నాటికి కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ దగ్గరున్న సమాచారం మేరకు ఈ వివరాలను వెల్లడించింది. ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ను పాత్రికేయులు మీడియా సమావేశంలో మంగళవారం ప్రశ్నించగా సుమారు 700-750 మధ్యలో వెంటిలేటర్లు వచ్చి ఉండొచ్చు అని అంచనాగా గణాంకాలను తెలియజేశారు తప్ప స్పష్టంగా వివరించలేదు. పైగా ప్రత్యేకంగా ఇవి కరోనా అవసరాల కోసం తయారుచేసిన మామూలు తరహా వెంటిలేటర్లేనని వ్యాఖ్యానించారు. అప్పటికే రాష్ట్రం దగ్గర సుమారు 240 వెంటిలేటర్లు ఉన్నట్లు గతంలో పలు మీడియా సమావేశాల్లో మంత్రి ఈటల, వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

కేంద్రం నుంచి జూలై 28నాటికే 1400 వెంటిలేటర్లు తెలంగాణకు వచ్చినట్లయితే ప్రతీరోజూ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ విడుదల చేస్తున్న బులెటిన్‌లో మాత్రం 1,117 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నట్లుగా పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది. పాత వెంటిలేటర్లు ఏమైనట్లు, కొత్తగా కేంద్రం నుంచి 1400 వెంటిలేటర్లు వచ్చినా మొత్తం 1,117 మాత్రమే ఉన్నట్లు పేర్కొనడంలోని మతలబు ఏంటనేది మాత్రం సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సైతం రాష్ట్రంలో రెండుసార్లు పర్యటించి రాష్ట్రానికి చేసిన సాయాన్ని ఏకరువు పెట్టారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం నుంచి వచ్చిన సాయాన్ని దాచిపెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.



Next Story

Most Viewed