రజనీకాంత్‌కు దాదా ఫాల్కే అవార్డు.. ఎలక్షన్ స్టంటేనా?

by  |
Super Star Rajinikanth
X

దిశ, వెబ్‌డెస్క్: రజినీకాంత్ ఈ పేరు తెలియని భారతీయుడు ఉండరు. ప్రపంచ నలుమూలల నుంచి సూపర్ స్టార్‌కి అభిమానులు ఉన్నారు. ఇన్నేళ్ల ఆయన సినీ జీవితంలో ఎన్నో విజయాలతో ఇండస్ట్రీనీ షేక్ చేశాడు రజినీ. స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారి, ఇప్పటికీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. బస్సు కండక్టర్‌గా తన జీవితాన్ని ప్రారంభించి సూపర్ స్టార్‌గా తన కష్టంతో, తన స్టైల్‌తో ఇండియన్ సినీ చరిత్రలోనే సంచలనంగా మారాడు. ఇంతటి అద్భుత ప్రస్థానం కలిగిన ఆయనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. రజనీకాంత్‌‌కు 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ గురువారం ప్రకటించారు. దీంతో తమిళనాడు ప్రజలతో పాటు సినీ ఇండస్ట్రీ సైతం కేంద్రం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది.

అయితే.. ఇటీవల రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రచారం, ఆయన పుట్టిన రోజు వేడుకలో పార్టీని ప్రకటిస్తారని, 2021 ఎన్నికల్లో ఖచ్చితంగా రజనీ పోటీచేస్తారన్న పరిస్థితులను మనం చూశాం. అనంతరం అనారోగ్య పరిస్థితులతో రాజకీయాల్లోకి రాలేనని చెప్పి అభిమానులు తీవ్ర నిరాశలోకి నెట్టారు. ఎంజీఆర్‌, జయలలిత తర్వాత తమిళనాడులో వెండితెరను ఓ ఊపు ఊపిన తమ అభిమాన నటుడు రజనీకాంత్‌.. రాజకీయ తెరపైనా హిట్ కొడతాడని ఆశించిన అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని లెక్కలు వేసుకుని, దాదాపు నాలుగేళ్లుగా కసరత్తు చేసిన ఆయన.. ఏం చేయబోతున్నారో అని ఆలోచించేలోపే షాకింగ్ ప్రకటన చేయడం అభిమానులు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వెయ్యాలని ఎప్పటినుంచో పథకాలు రచిస్తోన్న విషయం తెలిసిందే. అంతేగాకుండా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ఉన్న, రాజకీయాల్లోకి రాలేనని ప్రకటించిన రజనీకాంత్‌ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తమవైపుకు తిప్పుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఎన్నికల ముందు ప్రకటించడం జరిగిందని, ఇది ఖచ్చితంగా ఎలక్షన్ స్టంట్ అంటూ విపక్షాలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నాయి. ఈనెల 6న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో రజినీకాంత్ అశేష అభిమానుల ఓట్ల కోసమే అవార్డు ప్రకటించారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం తమిళ రాజకీయ వర్గాల్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



Next Story

Most Viewed