బౌద్ధ చారిత్రక ప్రదేశాల పరిరక్షణకు చర్యలు

by  |
Minister V. Srinivas Gowd,
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని కోటి లింగాల, నెలకొండపల్లి, దూలికట్టు, ఫ‌ణిగిరి వద్ద బౌద్ధ చారిత్రక ప్రదేశాలను పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటామ‌ని రాష్ట్ర సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ తెలిపారు. నాగార్జున‌సాగ‌ర్‌లో నిర్మిస్తున్న బుద్ధవ‌నం ప్రాజెక్టు పూర్తి అయింద‌ని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తన కార్యాలయంలో బుధవారం బుద్ధజయంతిని నిర్వహించారు. అనంతరం బౌద్దబిక్షువులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.

కొవిడ్‌-19 త‌గ్గుముఖం అనంత‌రం సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తార‌ని మంత్రి వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంత‌రం సీఎం కేసీఆర్ ఆదేశానుసారం బుద్ధవ‌నం ప్రాజెక్టు తిరిగి ప‌ట్టాలెక్కిందని, సాగ‌ర్ చుట్టుప‌క్కల మౌళిక స‌దుపాయాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు.

ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టుకు అనుబంధంగా బుద్ధిజం అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణలో బుద్ధుడు జీవించి ఉన్న కాలం నుంచి బుద్ధిజం ఉందన్నారు. బుద్ధుని తరువాత మరో బుద్ధుడిగా పేరుగాంచిన నాగార్జునుడు ఈ ప్రాంతంలోనే విజయపురిలో విశ్వవిద్యాలయంను స్థాపించారని, అనేక మంది బౌద్ద బిక్షువులు వివిధ దేశాల నుంచి వచ్చి విద్యను అభ్యసించారన్నారు. చారిత్రాత్మకమైన సాగర్ లో బుద్ధిజం అభివృద్ధి కి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.

సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజు, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, టూరిజం ఎండీ మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, బుద్ధవనం కన్సల్టెంట్ శివ నాగిరెడ్డి, బుద్ధవనం ఓఎస్డీ సుధన్ రెడ్డి, ఇంజినీరింగ్ అధికారి క్రాంతి బాబు, బౌద్ద బిక్షువులు, బుద్ధవనం అధికారులు పాల్గొన్నారు.

Next Story