అర్ణబ్‌కు మధ్యంతర బెయిల్ తిరస్కరణ

by  |
అర్ణబ్‌కు మధ్యంతర బెయిల్ తిరస్కరణ
X

ముంబయి: ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు కారకులుగా అభియోగాలున్న కేసులో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామికి బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను తిరస్కరించింది. అర్ణబ్ గోస్వామితోపాటు సహనిందితులు నితీష్ సర్దా, ఫిరోజ్ షేక్‌లకూ మధ్యంతర బెయిల్ మంజూరుకు నిరాకరించింది. ఈ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 439 కిందకు వచ్చే అంశాలేవీ లేవని పేర్కొంటూ న్యాయమూర్తులు ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కర్ణిక్‌ల డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది.

అయితే, రెగ్యులర్ బెయిల్‌ కోసం సెషన్స్ కోర్టులో దరఖాస్తు చేసుకోవడానికి పిటిషనర్లకు అవకాశమున్నదని సూచించింది. హైకోర్టు తీర్పునకు ముందే అర్ణబ్ గోస్వామి రెగ్యులర్ బెయిల్ కోసం అలీబాగ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించడం గమనార్హం. సెల్ ఫోన్ వినియోగిస్తున్నారని కొవిడ్ 19 క్వారంటైన్ సెంటర్ నుంచి అర్ణబ్ గోస్వామిని ముంబయి పోలీసులు ఆదివారం తలోజా సెంట్రల్ జైలుకు తరలించారు.

మహారాష్ట్ర హోం మినిస్టర్‌కు గవర్నర్ ఫోన్:
అర్ణబ్ గోస్వామి భద్రత, ఆరోగ్యంపై మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం మహారష్ట్ర హోం మినిస్టర్ అనిల్ దేశ్‌ముఖ్‌కు గవర్నర్ ఫోన్ చేసి మాట్లాడారు. జర్నలిస్టు కుటుంబాన్ని ఆయనతో కలవడానికి అవకాశమివ్వాలని సూచించారు.



Next Story

Most Viewed