ఆ కంపెనీలకు జగన్ సర్కార్ తీపికబురు..రూ.1,124 కోట్లు విడుదల

by  |
jagan-cm
X

దిశ, ఏపీ బ్యూరో: ఎంఎస్ఎంఈ, టెక్స్ టైల్, స్పిన్నింగ్ పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ పరిశ్రమలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం ప్రోత్సాహకాలను ప్రకటించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ ప్రోత్సాహకాలకు సంబంధించి రూ. 1,124 కోట్ల నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా కష్టకాలంలో కూడా వరుసగా రెండో ఏడాది పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలను అందించామని.. ఫలితంగా రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదనేది తమ లక్ష్యమని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఈ పరిశ్రమల ద్వారా 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిపారు.

నూతన పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇన్వెస్టర్లకు ప్రభుత్వం రాయితీలను ఇస్తుందనే నమ్మకాన్ని కలిగించాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో పని తక్కువ, హడావుడి ఎక్కువగా ఉండేదని సీఎం విమర్శించారు. గత ప్రభుత్వ బకాయిలు రూ. 1,588 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 2,086 కోట్ల ప్రోత్సాహకాలను అందించినట్లు సీఎం జగన్ తెలిపారు. అలాగే పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ బీసీలకు 62 %ప్రోత్సాహకాలను అందించినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed