జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

by  |
జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ
X
దిశ, ఏపీ బ్యూరో: నవరత్నాలు కింద పేదలందరికీ ఇళ్ల పథకంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు కేటాయించిన స్థలాల్లో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను విపక్షాలు స్వాగతిస్తుంటే…అధికార వైసీపీ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అప్పీల్ కు వెళ్తామని ప్రభుత్వం చెప్తోంది. నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని జగన్ సర్కార్ ప్రయత్నిస్తుంటే.. సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని నిలుపుదల చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని మంత్రులు ఆరోపించారు. దీనితో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

హైకోర్టు ఆదేశాలివే…

పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం కేటాయింపును హైకోర్టు తప్పుబట్టింది. ఇళ్ల నిర్మాణంపై హైకోర్టులో 128 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు 108 పేజీల తుది తీర్పును వెలువరించింది. ప్రభుత్వ పాలనా నిర్ణయాలు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే కోర్టులు తప్పక జోక్యం చేసుకుంటాయని వెల్లడించింది. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన 3 జీవోల్లోని పలు నిబంధనలను కొట్టివేసింది. ప్రభుత్వ కేటాయించిన స్థలాల్లో ఇళ్ల సముదాయాల నిర్మాణం చేపడితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. అగ్ని ప్రమాదాలు, మంచినీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఇళ్లు కట్టుకోవాలని బలవంతం చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. మహిళలకే కాకుండా విడాకులు తీసుకున్న పురుషులు, ట్రాన్స్‌జెండర్లకు కూడా ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గృహ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ, గృహనిర్మాణం, పర్యావరణ శాఖలోని నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కమిటీ నివేదిక నెలరోజుల్లో ఇవ్వాలని సూచించింది. ఈ నివేదికపై ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించి అప్పుడు గృహనిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. అప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇళ్ల నిర్మాణంలో సింగిల్‌ జడ్జి తీర్పుపై ప్రభుత్వ అప్పీల్‌ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. ‘సెంటు భూమిలో ఇల్లు ఎలా సరిపోతుంది. ఇళ్ల స్థలాలపై ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించండి. అప్పటి వరకూ నిర్మాణాలు చేపట్టవద్దు. కన్వేయన్స్‌ డీడ్‌లు రద్దు చేసి డీ-ఫాం పట్టాలివ్వండి. మహిళలకే కాదు.. పురుషులు, ట్రాన్స్‌ జెండర్లకూ స్థలాలివ్వాలి’’ అని నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకంపై శుక్రవారం హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇళ్ల నిర్మాణంపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. డివిజన్‌ బెంచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రభుత్వ అప్పీల్‌ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది.

లోపాలను ఎత్తిచూపిన హైకోర్టు…..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో పలు లోపాలను హైకోర్టు ఎత్తిచూపింది. ప్రధానంగా మూడు అంశాలను కోర్టు ప్రస్తావించింది. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలు సరిపోవని, ఈ విషయంలో ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించింది. ఆ ప్రక్రియ ముగిసే వరకు ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని తీర్పు చెప్పింది. మహిళల పేరుతోనే పట్టాలివ్వడం సరికాదని, అర్హులైన పురుషులు, ట్రాన్స్‌జెండర్లకూ ఇవ్వాలని చెప్పింది

అప్పీల్ కు వెళతాం: మంత్రి బొత్స సత్యనారాయణ

పేదలందరికి ఇళ్లపథకంపై హైకోర్టు తీర్పు బాధాకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సాంకేతిక అంశాలను ఆసరా చేసుకొని టీడీపీ నేతలు తమ పలుకుబడితో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ముందుకు సాగకుండా అన్నివిధాలా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పేదల ఇంటి నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే టీడీపీ అడ్డుకట్టవేస్తోందని ఆరోపించారు.
పేదలకు ఇళ్ల స్థలాలు, జగనన్న ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు తీర్పు హర్షణీయం – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే రూ.1,80,000 ఏమాత్రం సరిపోదని, రాష్ట్ర ప్రభుత్వమే పేదలకు నివాసయోగ్యమైన ఇళ్లు నిర్మించి ఇవ్వాలి లేదా రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed