ఆ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అంటే కోపం ఎందుకు..!

by  |
Nereducharla Municipal Councillor Family
X

దిశ, నేరేడుచర్ల: మాకు గత పదిరోజులుగా తాగునీరు రావడం లేదని సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలోని హుజూర్‌నగర్ రోడ్డులోని మూడో వార్డుకు చెందిన పదికుటుంబాలు మంగళవారం ధర్నా చేశాయి. నిజానికి వారికి నీటి సమస్య పదిరోజుల నుంచి ఉన్నా.. పట్టనానికి ఎమ్మెల్యే వస్తున్నాడని తెలిసి ధర్నా చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ధర్నాలో స్థానిక 11వ వార్డు కౌన్సిలర్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం గమనార్హం. అంతేగాకుండా.. కౌన్సిలర్ బంధువురాలైన ఓ మహిళ ధర్నాలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో పట్టణంలో రాజకీయపరంగా చర్చనీయాంశం అయింది.

రాజకీయ కోణంలోనే ధర్నా..?

నేరేడుచర్ల పట్టణంలోని మున్సిపాలిటీలో మంగళవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ సమావేశం అధికారులు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి స్థానిక హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాజరవుతున్నారని మున్సిపల్ అధికారులు ముందస్తుగా వెల్లడించారు. దీంతో 11వ వార్డు కౌన్సిలర్ కుటుంబ సభ్యులతో పాటు పది రోజులుగా ఉన్న నీటి సమస్య ఎదుర్కొంటున్న కుటుంబాలన్నీ కోదాడ-మిర్యాలగూడ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కుటుంబానికి ఓ మహిళ ‘‘ఇవాళ మీటింగ్‌కు ఎమ్మెల్యే వస్తున్నాడట. ఆయన కారు చిత్తు చేయకపోతే చూస్కో’’ అని ఆమె ధర్నాలో చెప్పిన మాటలను కొందరు వీడియోలు తీసి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో వీడియోలో వాయిస్ కౌన్సిలర్ కుటుంబ సభ్యులదేనని కొందరు గుర్తించి, రాజకీయంగా చర్చనీయాంశం చేశారు.

ఆ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అంటే కోపం ఎందుకు!

నేరేడుచర్ల మున్సిపాలిటీ గతంలో జరిగిన మొట్టమొదటి మున్సిపల్ ఎన్నికల్లో 15 కౌన్సిలర్ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ సీపీఎం, సీపీఐ, టీడీపీని కలుపుకుని కూటమిగా ఏర్పడి పోటీ చేసింది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఒంటిరిగానే ఎన్నికల బరిలోకి దిగింది. ఈ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కావడంతో కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే 11వ వార్డు కౌన్సిలర్‌ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది. ఎన్నికల్లో 15 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ కూటమి ఎనిమిది స్థానాల్లో మెజార్టీ స్థానాలు గెలిచింది. అయినా.. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కో-ఆప్షన్ సభ్యుల ద్వారా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టారు. దీంతో తమకు దక్కాల్సిన చైర్మన్ పీఠాన్ని ఎమ్మెల్యే కక్షగట్టి ఆయనకు అనుకూలమైన వ్యక్తికి ఇవ్వడంతో 11వ వార్డు కౌల్సిలర్ కుటుంబసభ్యులు నిప్పులు చెరుగుతున్నారు. ధర్నా కూడా అందులో భాగంగానే జరిగిందని స్థానికంగా చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed