ఆ ఘటనకు పదేళ్లు

by  |
ఆ ఘటనకు పదేళ్లు
X

దిశ, కరీంనగర్: మావోయిస్టు పార్టీ చేసిన దాడుల్లో అతి పెద్ద ఘటన అది. పారా మిలటరీ బలగాలను మట్టుబెట్టడమే లక్ష్యంగా పాల్పడ్డ విధ్వంసం జరిగి నేటికి సరిగ్గా పదేళ్లు. మైన్ ప్రూఫ్ వాహనాలు ఉన్నాయన్న ధీమా బలగాలదైతే, వాటినే టార్గెట్ చేసి మావోయిస్టులు పై చేయిగా నిలిచిన సంఘటన చత్తీస్ ఘఢ్ లో చోటు చేసుకుంది. 2010 ఏప్రిల్ 6న దండకారణ్య అటవీ ప్రాంతంలోని చింతల్ నార్, తాడిమెట్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన పారామిలటరీ బలగాలను అలర్ట్ చేసింది. కూంబింగ్ నిర్వహించేందుకు ముందుగా అక్కడి అటవీ ప్రాంతంలోకి మైన్ ప్రూఫ్ వాహనంలో సీఆర్పీఎఫ్ బలగాలు బయలుదేరాయి. అటవీ ప్రాంతానికి చేరుకున్న ఈ వాహనాన్ని మందుపాతరతో పేల్చారు మావోయిస్టు పార్టీ మిలటరీ ప్లాటూన్ సభ్యులు.

మరో వైపున అంబూష్ తీసుకున్న మరో పార్టీ వాహనంలోంచి బతికి బయటపడ్డవారిని హతమార్చడమే లక్ష్యంగా వేచి చూస్తోంది. మందుపాతర పేల్చిన కొద్దిసేపటి తరువాత వాహనంలో బతికి ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లు నెమ్మదిగా దిగడం ఆరంభించారు. అంతే అప్పటికే మోర్చా తీసుకుని ఉన్న మరో ప్లాటూన్ ధనధాన్ అంటూ కాల్పులు జరిపింది. అంతే ఒక్కసారిగా అటవీ ప్రాంతమంతా తూటాల మోతలు, ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. ఈ ఘటనలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.

ముందే ఎనాలిసిస్ మావోయిస్టులను ఏరివేసేందుకు అటవీ ప్రాంతాల్లో ఎత్తులకు పై ఎత్తులతో యుద్ధం సాగుతోంది. ఈ నేఫథ్యలో మందుపాతరలతో బలగాలు ప్రాణాలు కొల్పోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా మైన్ ప్రూఫ్ వాహనం ఏర్పాటు చేయించారు.

అయితే ఈ వాహనాల గురించి తెలుసుకున్న మావోయిస్టులు దాని సామర్థ్యంతోపాటు వైఫల్యాలపై కూడా అంచనా వేసుకుంది. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన ఈ మైన్ ప్రూఫ్ వాహనాల వల్ల తమకు జరిగే నష్టం ఏమీ లేదని మావోయిస్టు పార్టీ ఓ అంచనాకు వచ్చింది. ఈ మేరకు టెక్నికల్ టీం ఇచ్చిన నివేదికలను ఆధారం చేసుకుని తన అధికారిక పత్రిక అయిన ‘ఆవామి ఏ జంగ్’ లో విశ్లేషాణత్మకమైన వ్యాసాన్ని కూడా రాసుకుంది. మైన్ ప్రూఫ్ వాహనం సామర్థ్యానికి మించిన మందుగుండు సామాగ్రితో పేలిస్తే అందులో ప్రయాణించే పోలీసులకే ప్రమాదమని, ఆ వాహనాలు తమకు పట్టున్న ప్రాంతాలకు వచ్చినా తమనేమీ చేయలేవని విశ్లేషించుకుంది. ఈ మైన్ ప్రూఫ్ వాహనాలు 35 కిలోల ఆర్డీఎక్స్ తో బ్లాస్ట్ చేస్తే మాత్రం చెక్కు చెదరవని అంతకు మించి ఆర్డీఎక్స్ ను ఉపయోగించి పేలిస్తే వాహనం కుప్పకూలండం ఖాయమని భావించింది.

అంతేకాకుండా కేవలం డ్రైవర్ మాత్రమే ముందు చూడగల్గుతాడని, వెనక ప్రాంతంలో ఉన్న వారు చూసేందుకు పైన ఓ చిన్న రంధ్రం మాత్రమే ఉంటుందని కూడా నిర్ధారించుకున్నట్టుగా ఆ వ్యాసంలో రాసుకుంది. అలాగే ఈ వాహనానికి కేవలం వెనక ప్రాంతం నుండి మాత్రమే ఒక ద్వారం ఉంటుందని మందుపాతర పేల్చినప్పుడు అందులో బ్రతికున్న వారు అదే ద్వారం నుండి దిగుతారని ఈ సమయంలో అంబూష్ పార్టీ కాల్పులు జరిపితే అందులో ఉన్నవారందరిని మట్టుబెట్టవచ్చని కూడా ఆ వ్యాసంలో రాసుకుంది. ఇదే విధానాన్ని అవలంభించిన మావోయిస్టులు సుక్మా జిల్లాలో 10 ఏళ్ల క్రితం మైన్ ప్రూఫ్ వాహనాన్ని పేల్చివేసి ఏకంగా 76 మందిని మట్టుబెట్టారు.

మైన్ ప్రూఫ్ వెహికిల్ పై జరిపిన మొట్టమొదటి దాడిలోనే మావోయిస్టు పార్టీ తన అధికారిక పత్రికలో రాసుకున్నట్టుగానే చేతల్లో చూపించింది. విప్లవ పార్టీలు జరిపిన దాడుల్లో ఇంత భారీ ఎత్తున బలగాలు నష్టపోయిన సంఘటన ఇదే మొట్టమొదటిది కావడం ఓ ఎత్తైతే, బలగాల్లో మనో ధైర్యాన్ని నింపుతుందున్నకున్న మైన్ ప్రూఫ్ వెహికిల్ గురించి ప్రభుత్వం పునరాలోచనలో పడేసి ప్రత్యామ్నాయాలను ఎంచుకునేలా చేసిందనే చెప్పాలి. రోడ్లు కూడా లేని ప్రాంతంలో ఈ వాహనంలో బలగాలు ప్రయాణించే అవకాశంతోపాటు మందుపాతరల వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండదన్ననమ్మకంతో ఈ వెహికిల్ ను తయారు చేయిస్తే దానిని కూడా టార్గెట్ చేసి పైచేయిగా నిలిచారు మావోయిస్టులు.

ఈ ఘటనలో 76 సీఆర్పీఎఫ్ జవాన్లను కోల్పోవడం పారా మిలటరీ బలగాలను కుంగదీసింది. వారి కుటుంబాలు కూడా పెద్ద దిక్కులేకుండా మిగిలాయి. ప్రభుత్వాలు ఇచ్చే భరోసా ఆర్థికపరమైనదే కానీ, ఇంటి పెద్దను కోల్పోవడం ఆ కుటుంబాలు దిగమింగుకోలేకపోయాయి. దశాబ్ధం గడిచినా నేటికీ సీఆర్పీఎఫ్ బలగాలు ఈ దుర్ఘటనను మర్చిపోలేదంటే వారిలో ఈ దుర్ఘటన ఎంతలా నాటుకపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఒకే ఘటనలో ఇంత భారీగా పారామిలటరీ జవాన్లు బలికావడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది.

Tags: Paramilitary, Maoists, Magazine, CRPF Jawans, Pharmacy, Mine Proof Vehicles, 10 years


Next Story