వ్యాక్సిన్ వేసుకో.. ఆవును గెలుచుకో!

by  |
వ్యాక్సిన్ వేసుకో.. ఆవును గెలుచుకో!
X

దిశ, ఫీచర్స్ : ఏడాది కాలంగా ప్రపంచమంతా కరోనా జపంలోనే మునిగితేలుతోంది. ఫస్ట్ వేవ్ నుంచి పూర్తిగా కోలుకోకముందే సెకండ్ వేవ్‌తో మరోసారి విరుచుకుపడుతూ.. లక్షలాది మంది ప్రాణాలను హరించేస్తుంది. మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడాలంటే టీకాలే శరణ్యంగా కనిపిస్తుండగా.. వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న కొన్ని దేశాలు ముప్పును తప్పించుకుంటున్నాయి. అయితే వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో నెలకొన్న అపోహలు, సైడ్ ఎఫెక్ట్స్ భయం ప్రభుత్వాల ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలను వ్యాక్సిన్లు వేసుకునేలా ప్రోత్సహించేందుకు థాయ్‌లాండ్‌లో వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టారు. టీకాలు వేసుకున్నవారి నుంచి లాటరీ పద్ధతిలో వారానికి ఒకరిని ఎంపిక చేసి ఆవును గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు.

నార్త్ థాయ్‌లాండ్, చియాంగ్ మై ప్రావిన్స్‌లోని మే కేమ్ జిల్లాలో.. జూన్ నుంచి ప్రతీవారం ఒక లక్కీ వ్యాక్సినేటెడ్ విలేజర్‌ను ఎంపిక చేయనున్నారు. ఈ పద్ధతిలో ఎంపికైన వారికి రూ. 20 వేలకు పైగా విలువైన ఆవును బహుమతిగా అందజేయనున్నారు. వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో 24 వారాల పాటు కొనసాగనున్న ఈ క్యాంపెయిన్‌‌ను ప్రకటించినప్పటి నుంచి పట్టణంలోని 43000 మంది ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య వారంలోనే వందల నుంచి వేలకు చేరిందని డిస్ట్రిక్ట్ చీఫ్ బూన్‌లూ వెల్లడించారు. ఇక్కడి గ్రామస్తులకు ఆవులంటే ఇష్టం, ఎందుకంటే వాటిని విక్రయించి డబ్బులు సంపాదించవచ్చు అని కూడా పేర్కొన్నారు.

థాయ్‌లాండ్ ప్రభుత్వ నేషనల్ రోల్‌అవుట్ ప్రకారం.. జూన్ 7 నుంచి ‘మే కేమ్’ టౌన్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తారు. కాగా చియాంగ్ మై ప్రావిన్స్‌‌‌లో ప్రవేశపెట్టిన స్కీమ్‌ను ఆదర్శంగా తీసుకున్న మిగతా ప్రావిన్స్‌లు కూడా ‘గోల్డ్ నెక్లెస్‌లు, స్టోర్ డిస్కౌంట్ కూపన్స్ లేదా నగదు పంపిణీ’ వంటి పథకాలతో వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.


Next Story