అత్యవసర చికిత్సకు పోతే కరోనా అంటుకుంటోంది

by  |
అత్యవసర చికిత్సకు పోతే కరోనా అంటుకుంటోంది
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు ఇప్పుడు టెస్టింగ్ కేంద్రాలు, ఆసుపత్రులు కేంద్రాలుగామారాయి. ఒకే ఆసుపత్రిలో అన్ని వార్డులతో పాటు కరోనా వార్డులు ఉండడంతో ఈ ఇన్‌ఫెక్షన్ తీవ్రత ఎక్కువవుతోంది. ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టుల్ని నిర్వహించడం కోసం ఏర్పాటు చేసిన టెస్టింగ్ కేంద్రాల్లో తగిన ప్రోటోకాల్‌ను పాటించకపోవడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తోంది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేకంగా వార్డులు ఉన్నా తగిన జాగ్రత్తలు పాటించకపోవడం ద్వారా ఇతర వార్డుల్లోని పేషెంట్లకు కూడా అంటుకుంటోంది. నిమ్స్ ఆసుపత్రిలో ఇదే తరహాలో అత్యవసర వైద్య చికిత్స కోసం వచ్చిన ఒక పేషెంట్‌కు కొన్ని రోజుల తర్వాత కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఉదంతాన్ని ఆ ఆసుపత్రి వైద్యులు ఉదహరించారు.

ఐసీఎంఆర్ ప్రోటోకాల్ ప్రకారం కరోనా పేషెంట్లకు చికిత్స అందించే వార్డుల ఏర్పాటు, అక్కడ చికిత్స చేసే వైద్య సిబ్బంది, పేషెంట్లు వచ్చిపోవడానికి ప్రత్యేకంగా ఎంట్రీ, ఎగ్జిట్… ఇలాంటి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. కానీ చాలా ఆసుపత్రుల్లో ఓపీ బ్లాక్ మొదలు ఇన్‌పేషెంట్లు, వివిధ రకాల వార్డులు, కరోనా వార్డులు ఒకే ప్రాంగణంలో తగిన జాగ్రత్తలు, నిబంధనలు, దూరం పాటించకపోవడం వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతోంది. ఒకే ఆసుపత్రిలో ఒక అంతస్తు మామూలు అనారోగ్యాలతో వచ్చే పేషెంట్లకు, మరో అంతస్తు కరోనా పేషెంట్ల కోసం కేటాయించడంతో ఉమ్మడిగా కొన్ని దారులు, కారిడార్లు ఉంటున్నందున వైరస్ వ్యాప్తి పెరుగుతోంది.

కొన్ని ఆసుపత్రుల్లో ఔట్‌పేషెంట్ సేవలు కొనసాగుతున్నందున వివిధ అనారోగ్య లక్షణాలతో అక్కడికి వచ్చే పేషెంట్లను అనుమానిత పేషెంట్లుగానే పరిగణించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ చాలా చోట్ల అవి అమలుకావడంలేదు. ఫలితంగా లక్షణాలే బైటకు కనిపించకుండా వైరస్ క్యారియర్లుగా ఉండే పేషెంట్ల నుంచి ఆ ఆసుపత్రిలోని డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది తదితరుల ద్వారా మాత్రమే కాకుండా కుర్చీలు, బల్లలు, వాడిపారేసిన మాస్కుల ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తున్నట్లు డాక్టర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌తో ఆ ప్రమాదం ఎక్కువ : తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ కార్యదర్శి డాక్టర్ అన్వేష్
“దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ చోటుచేసుకున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. దీంతో టెస్టు చేయించుకునేంత వరకు ఎవరికి పాజిటివ్ ఉందో లేదో తెలియదు. ఎక్కడెక్కడో తిరిగి వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వస్తున్నారు. అత్యవసర కేసుల్లో నేరుగా అడ్మిట్ చేయాల్సి వస్తోంది. దీంతో పాజిటివ్ ఉందో లేదో తెలుసుకోడానికి ఒక రోజు సమయం పడుతోంది. వచ్చిన వెంటనే ర్యాపిడ్ టెస్టు చేసి నిర్ధారణ చేసుకున్నట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకుని వైరస్ వ్యాప్తిని నివారించవచ్చు. కానీ చాలా ఆసుపత్రులు ర్యాపిడ్ టెస్టుకు బదులుగా ఆర్‌టీ-పీసీఆర్ చేస్తున్నాయి. దీంతో పాజిటివ్ ఉన్నదీ లేనిదీ కొన్ని గంటల తర్వాత వెల్లడయ్యే సమయానికే ఒక మేరకు వ్యాపిస్తోంది. దీని ద్వారా అప్పటివరకూ నాన్-కొవిడ్ పేషెంట్లుగా ఉన్నవారు ఇన్‌ఫెక్షన్‌‌కు గురవుతున్నారు. కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఐసొలేషన్ వార్డులు అని పెట్టుకున్నా కొన్ని ఆసుపత్రుల్లో పేషెంట్లంతా వాడే దారుల్ని, వెయిటింగ్ హాళ్ళనే వాడాల్సి వస్తోంది. దీంతో వ్యాప్తికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి”.



Next Story

Most Viewed