- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రిజర్వేషన్ల పునర్విభజన.. సిట్టింగ్ కార్పొరేటర్ల టెన్షన్

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను గడువులోగా పూర్తిచేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. దీనిలో భాగంగానే డివిజన్ల పెంపు, రిజర్వేషన్ల పునర్విభజన ప్రక్రియకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో సిట్టింగ్ కార్పొరేటర్ల గుండెల్లో దడ మొదలైంది. ఇన్నాళ్లూ డివిజన్ తమది అనుకున్న వారంతా.. ఇప్పడు పునర్విభజనలో రిజర్వేషన్ మారే అవకాశం ఉండడం.. తమకు పట్టున్న ప్రాంతాలు వేరే డివిజన్లలోకి పోనుడడంతో ఏం చేయాలనే మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉన్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరో పది డివిజన్లు పెంచి మొత్తం 60 డివిజన్లు ఏర్పాటు చేసి రిజర్వేషన్లు కూడా ఖరారు చేయనుంది. అయితే గెలిచిన డివిజన్ నుంచే మళ్లీ పోటీచేయాలనే ఆలోచనలో ఇన్నాళ్లూ ఉన్నవారంతా.. రిజర్వేషన్ మారితే ఏం చేయాలో తెలియక సతమతమవతున్నారు. అంతేకాదు.. కాలం కలిసిరాకపోతే తమ భవిష్యత్ ఏంటంటూ మదనపడుతున్నారు.
కోడ్ అమలుతో ఊపిరి పీల్చుకున్నారు
కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం అన్ని డివిజన్లలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. దీనిలో భాగంగానే మంత్రి ఇప్పటి వరకు పలు కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేశారు. అయితే కొంత మంది కార్పొరేటర్లు మాత్రం మిగిలిపోయిన అభివృద్ధి పనులు చేయించాలా? లేక డివిజన్ల పునర్విభజన పూర్తయ్యాక చేయించాలా? అనే డైలమాలో ఉన్నారు. ఒక వేళ ఇప్పుడు చేపిస్తే అదికాస్త వేరే డివిజన్లో కలిస్తే పరిస్థితి ఏంటనే ఆలోచనలో ఇప్పటి వరకు ఉన్నారు. రిజర్వేషన్ కూడా కలిసిరాకపోతే శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని వేచి చూశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉన్నందున కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఏదిఏమైనా రిజర్వేషన్ల పునర్విభన అంశం ఇప్పడు సిట్టింగ్ కార్పొరేటర్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
గెలుపు గుర్రాలకే టికెట్లు
గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలతో ఖంగుతిన్న అధికారపార్టీ.. సిట్టింగు కార్పొరేటర్లే ఎక్కువగా ఓడిపోయారని గ్రహించింది. ఈ అంశాన్నే ఇప్పుడు త్వరలో జరుగనున్న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పరిగణలోకి తీసుకోనుంది. ఇటీవల జరిగిన ముఖ్యనేతల సమావేశంలో కూడా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ అంశం కూడా కొంతమంది కార్పొరేటర్లకు స్థిమితంగా ఉండనీయడం లేదు. అంతేకాదు అవినీతి ఆరోపణలు, పలు అక్రమాలను, సెటిల్మెంట్లను ప్రోత్సహించిన వారిని కూడా ఈసారి పార్టీ దూరం పెట్టనుందనే సమాచారం ఉండడంతో ఇప్పటినుంచే కొంత మంది లాబీయింగ్ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.
అధికార కార్పొరేటర్లకు అవినీతి మరకలు
అధికార పార్టీ కార్పొరేటర్లు దాదాపు సగం మంది పలు వివాదాలు, దందాలు, అవినీతి ఆరోపణలు ఉన్నవారే అనే విషయాన్ని గ్రహించిన అధిష్ఠానం ఈసారి వారికి టిక్కెట్లు దక్కవనే సంకేతాలు ఇప్పటికే పంపినట్లు సమాచారం. గతంలో కార్పొరేటర్లపై సర్వే చేయించిన పార్టీ పెద్దలు ఆ వివరాలు కూడా పరిశీలించి పనితీరు సరిగా లేని కార్పొరేటర్ల వివరాలు కూడా ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని చేసినా అధికార పార్టీ టికెట్ దక్కితే చాలు గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నవారు.. ఈ సారి టికెట్ ఇవ్వడానికి పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటుండడంతో భవిష్యత్ పై బెంగపెట్టుకుంటున్నారు. టికెట్ కోసం ఏంచేయాలో ఎవర్ని కలవాలో ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
సైలెంట్గా బీజేపీ కార్యాచరణ
ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ఖమ్మం కార్పొరేషన్ మీదే ఎక్కువ దృష్టి పెట్టిన బీజేపీ ఆ దిశగా సైలెంట్గా తన కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే జిల్లాలో బలమైన ఓ సామాజిన వర్గానికి చెందిన నేతలను భారీగా చేర్చుకునేందుకు రంగం కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఆయా డివిజన్ల టికెట్లు కూడా తమకే కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చారని.. నోటిఫికేషన్ రాగానే ప్రచారానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అధికార పార్టీ నుంచి టికెట్ దక్కని బలమైన నాయకులు, పార్టీలో ఏళ్లుగా ఉంటూ అసంతృప్తిగా ఉన్నవారికి కూడా గాలం వేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని సమీకరణల నేపథ్యంలో సిట్టింగ్ కార్పొరేటర్లకు మళ్లీ సీటు దక్కాలంటే కష్టమే.. ఈ ఆలోచనలే ఇప్పు వారికి దడ పుట్టిస్తోంది.