బండి vs కంచర్ల.. తారాస్థాయికి మాటల యుద్ధం

by  |
Bandi Sanjay, Kancharla Bhupal Reddy
X

దిశ, నల్లగొండ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నల్లగొండ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. బండి సంజయ్ ‘గో బ్యాక్’ అడుగడుగునా టీఆర్ఎస్ శ్రేణులు ఎదురుతిరగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అంతేగాంకుడా.. ఈ పర్యటనలో బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంటనే స్పందించిన నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బండి సంజయ్ మాటలకు ఘాటు రిప్లై ఇచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పట్ల గజినీగా మారారు. ఒకసారి పత్తి వేయమంటారు, మరోసారి వరిధాన్యం వేయాలని చెప్పి, ఇంకోసారి వరివేస్తే ఉరే అని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. గతంలో ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించి, ఇప్పుడు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటించబోతున్నామని ముందుగానే షెడ్యూల్ ఇచ్చామని, అయినా, పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ భద్రత కల్పించడంతో విఫలమయ్యారు. తాటాకు చప్పుళ్లకు తాము భయపడం. కోడిగుడ్లు, రాళ్లు చెప్పులతో దాడులు చేస్తే, రాత్రింభవళ్ళూ కల్లాల్లో పడిగాపులు గాస్తున్న రైతులకు తగిలాయి. రైతుల కోసం రాళ్ళ దాడికైనా, బూతులు తిట్టినా పడుతాం.’’ అని బండి సంజయ్ అన్నారు.

అనంతరం దీనికి స్పందించిన నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజేపీ నాయకులు రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. లేకపోతే గుడ్డలూడదీసి కొడతాం. సమైక్య పాలనలో తెలంగాణ రైతాంగం అవస్థలు పడింది, తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారింది. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. రైతులు ఇబ్బంది పడొద్దనే, రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తోంది. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలను ఒప్పుకోకపోవడంతోనే బీజేపీ నేతలు కక్షగట్టారు. తెలంగాణ రైతులను నట్టేట ముంచేలా కేంద్రం వ్యవహరిస్తోంది. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ. ఏ మొహం పెట్టుకొని రైతుల వద్దకు వస్తున్నారు. టీఆర్ఎస్ సైన్యం పిడికిలి బిగిస్తే గాల్లో కొట్టుకోపోతారు. గుజరాత్, వ్యాపారస్తులైన అంబానీలు, ఆదానీలకు మోడీ సర్కారు దేశాన్ని దోచి పెడుతోంది. రైతులను రాళ్లతో కొట్టి బీజేపీ నాయకులు చరిత్ర హీణులుగా మిగిలిపోయారు. ఎంత ధైర్యం ఉంటే రైతులపై దాడులు చేస్తారు. రైతు కన్నెర్ర చేస్తే బీజేపీ కొట్టుకుపోతోంది.’’ అని కంచర్ల బండి సంజయ్‌కి ఘాటుగా రిప్లై ఇచ్చారు.

Next Story