టెంపరెక్కిస్తున్న టెంపరేచర్స్.. 42 డిగ్రీలు నమోదు

by  |
టెంపరెక్కిస్తున్న టెంపరేచర్స్.. 42 డిగ్రీలు నమోదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎండలు సుర్రుమంటున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం నుంచే ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలో అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ సెంటీగ్రేడ్‌ దాటుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటిపోయాయి. పెరుగుతున్న ఎండలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటి నుంచే మధ్యాహ్నం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెంటిగ్రేడ్‌ దాడే అవకాశముందని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (టీఎస్‌డీపీఎస్‌) అంచనా వేసింది. ఆదివారం నుంచే రాష్ట్రంలో 42 డిగ్రీల గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం 42 డిగ్రీలు దాటాయి. నిన్న రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్​జిల్లా జైనథ్‌తో పాటుగా భోరజ్, ఆదిలాబాద్​ అర్బన్​ మండలంలో 42.7 సెంటీగ్రేడ్​ఉష్ణోగత్ర నమోదైంది. అ దేవిధంగా ఆదిలాబాద్​ జిల్లాలోని మావలలో 42.5, మంచిర్యాల జిల్లా జన్నారంలో 42.2, హజ్పూర్‌లో 42.2, ఆదిలాబాద్​రూరల్​జిల్లా పిప్పలధారిలో 42.1 డిగ్రీలు నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌తో పాటుగా నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్​ జిల్లాలో 41 డిగ్రీలకు పైగా నమోదైంది. హైదరాబాద్‌లోని గణాంకభవన్​ ఏరియాలో 40.1 డిగ్రీలు దాటింది. రంగారెడ్డి, హైదరాబాద్‌లోని నాంపల్లి, మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 39.5 సెంటీగ్రేడ్లు దాటి ఎండలు నమోదయ్యాయి.

వచ్చే మూడురోజుల పాటు జయశంకర్​ భూపాలపల్లి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 43 డిగ్రీలు, మహబూబాబాద్​, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 42 డిగ్రీలు, నిజామాబాద్​, నిర్మల్​, వరంగల్​ రూరల్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట​ జిల్లాల్లో 41, వనపర్తి, నారాయణపేట, మమబూబ్​నగర్, కామారెడ్డి, జోగుళాంబ గద్వాల, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్​జిల్లాల్లో 40 సెంటీగ్రేడ్‌లు మించి ఎండలు ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్​ప్రాంతంలో 39 నుంచి 40 డిగ్రీలు ఎండలు ఉండే అవకాశాలున్నాయి. కాప్రా, ఉప్పల్​, హయత్​నగర్, ఎల్​బీనగర్, సరూర్​నగర్, మలక్​పేట్, సంతోష్​నగర్, చాంద్రాయణగుట్ట, ఛార్మినార్, ఫలక్​నుమా, రాజేంద్రనగర్, మెహదీపట్నం, కార్వాన్​, గోషామహల్​, ముషీరాబాద్, అంబర్​పేట్, ఖైరతాబాద్​, జూబ్లీహిల్స్, యూసఫ్​గూడ ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

టీఎస్‌-వెదర్‌ మొబైల్‌ యాప్‌..

ఉష్ణోగ్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు టీఎస్‌డీపీఎస్‌ ఆధ్వర్యంలో 589 మండలాల్లో 1,044 ఆటోమేటెడ్‌ వెదర్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ స్టేషన్లు గంటకోసారి ఉష్ణోగ్రతల వివరాలను తెలుపుతామని, టీఎస్‌డీపీఎస్‌ ద్వారా గ్రామస్థాయి వరకు వాతావరణ వివరాలను తెలిపేందుకు ప్రభుత్వం (ts- weather) మొబైల్‌ యాప్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ యాప్‌ను ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసుకొంటే ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు తెలుసుకోవచ్చని, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలు, హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతాల్లో వాతావరణ వివరాలు తెలిపేందుకు ఎల్‌ఈడీ తెరలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విపత్తుల నిర్వహణశాఖ ‘హీట్‌వేవ్‌ యాక్షన్‌ ప్లాన్‌-2021’ను ఇప్పటికే విడుదల చేశామని, రాష్ట్రస్థాయి మానిటరింగ్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేశామని, పగటిపూట తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


Next Story

Most Viewed