- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి నగ్నంగా పరుగులు.. ఆపై చెరువులో శవమై తేలిన యువతి
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడ శంకర్నగర్లో 25 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

దిశ, మేడిపల్లి : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడ శంకర్నగర్లో 25 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి నగ్నంగా వీధుల్లో పరుగులు తీసిన యువతి, అనంతరం సమీపంలోని ఆలయం నుంచి విగ్రహాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. కొద్దిసేపటికే పక్కనే ఉన్న పీర్జాదిగూడ చెరువులో ఆమె మృతదేహం లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా దేవుపల్లి గ్రామానికి చెందిన వక్కలగడ్డ తేజస్విని (25), తన తల్లి అరుణ (52)తో కలిసి పీర్జాదిగూడ శంకర్నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. తేజస్విని తండ్రి వక్కలగడ్డ ఈశ్వరరావు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తేజస్విని గతంలో బెంగళూరులో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసినట్లు సమాచారం.
తల్లి, కూతుళ్లు కొంతకాలంగా ఎయిర్బీఎన్బీ (Airbnb) యాప్ ద్వారా అద్దె ఇళ్లలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట కాప్రా చెరువు సమీపంలో నివసించి, అనంతరం పీర్జాదిగూడ శంకర్నగర్కు మారినట్లు సమాచారం. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, శనివారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో తేజస్విని తన తల్లిని ఇంట్లో ఉంచి, బయట నుంచి తాళం వేసి నగ్నంగా వీధుల్లో పరుగులు తీసినట్లు సమాచారం. అనంతరం సమీపంలోని ఓ ఆలయానికి వెళ్లి అక్కడి అమ్మవారి విగ్రహాన్ని, చీరను తీసుకుని వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
కొద్దిసేపటికే పక్కనే ఉన్న పీర్జాదిగూడ చెరువులో తేజస్విని మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చెరువులో పడేసినట్లు భావిస్తున్న ఆలయ విగ్రహం కోసం డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన పై తల్లి అరుణ మాట్లాడుతూ గత ఆరు నెలలుగా తనకు, తన కుమార్తెకు పీడకలలు వస్తున్నాయని, కలల్లో రక్తం కనిపిస్తున్నట్లు అనిపించేదని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. యువతి మృతి వెనుక మానసిక ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా ? లేదా మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది.






