చక్రం తిప్పుతున్న రాణా ప్రతాప్ రెడ్డి.. బీజేపీలోకి భారీగా చేరికలు..

by Disha Web Desk 19 |
చక్రం తిప్పుతున్న రాణా ప్రతాప్ రెడ్డి.. బీజేపీలోకి భారీగా చేరికలు..
X

దిశ, ఖానాపూర్: రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని.. అందుకు యువత కీలక భూమిక పోషించాలని నర్సంపేట మాజీ శాసనసభ్యులు, బీజేపీ రాష్ట్ర నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ నియోజకవర్గ యువ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఖానాపురం మండలం, మంగళవారిపేట గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, యువకులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి రేవూరి ప్రకాశ్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దేశ ప్రజలందరూ బీజేపీ పార్టీ వైపే చూస్తున్నారన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు దూరమయ్యారని పేర్కొన్నారు. సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గడిచిన ఏడున్నర సంవత్సరాల్లో ఏం సాధించలేదని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగమని చెప్పి.. కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలిచ్చుకున్నారని మండిపడ్డారు.

టీఆర్ఎస్ పాలనలో యువతకు ఉద్యోగాలు లేవని.. ప్రజా వ్యతిరేక పాలనకు చరమ గీతం పాడాలని కోరారు. బీజేపీ వల్ల మాత్రమే అది సాధ్యమవుతుందని నమ్మే.. వివిధ పార్టీల నుండి పెద్ద ఎత్తున యువత బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అబోతు రాజు యాదవ్, మండల నాయకులు, మంగళవారిపేట గ్రామ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed