108 అంబులెన్స్‌లో మహిళకు సురక్షిత ప్రసవం

by Ratna Kumari |

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తాళ్లమడ గ్రామంలో 108 అంబులెన్స్‌లో ఓ గర్భిణికి సురక్షితంగా ప్రసవం జరిగింది.

108 అంబులెన్స్‌లో మహిళకు సురక్షిత ప్రసవం
X

దిశ, సత్తుపల్లి : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తాళ్లమడ గ్రామంలో ఆదివారం 108 అంబులెన్స్‌లో ఓ గర్భిణికి సురక్షితంగా ప్రసవం జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవి అనే మహిళ ఐదో కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దేవికి ఆదివారం మధ్యాహ్నం పురిటి నొప్పులు తీవ్రంగా రావడంతో కుటుంబ సభ్యులు 108 సేవలకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సత్తుపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) ప్రవీణ్, పైలట్ కట్టం మహేష్ సంఘటన స్థలానికి చేరుకుని ఆశా కార్యకర్త సహాయంతో గర్భిణిని సత్తుపల్లి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

మార్గమధ్యంలో పురిటి నొప్పులు మరింత తీవ్రం కావడంతో అంబులెన్స్‌ను రహదారి పక్కన నిలిపి, గ్రీన్ హెల్త్ సర్వీసెస్ కాల్ సెంటర్‌లోని వైద్యుల సూచనల మేరకు 108 సిబ్బంది సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. అనంతరం తల్లి, శిశువును సత్తుపల్లి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో చేర్పించారు. 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లి, శిశువును క్షేమంగా కాపాడటంపై తాళ్లమడ గ్రామస్తులు, ఆసుపత్రి సిబ్బంది, మూడు జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజీరుద్దీన్, నూతనంగా బాధ్యతలు చేపట్టిన 108 జిల్లా అధికారి ఆలేటి ప్రణయ్ కుమార్ అభినందించారు.

Next Story