రాసి పెట్టుకొండి.. వచ్చే మార్చిలో మాదే అధికారం : రేవంత్ రెడ్డి

by Disha Web Desk |
రాసి పెట్టుకొండి.. వచ్చే మార్చిలో మాదే అధికారం : రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : మరో 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, 2023, మార్చి తర్వాత కాంగ్రెస్‌దే అధికారమని, దీన్ని రాసిపెట్టుకోవాలని టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్​దొంగలను చార్మినార్​దగ్గర గుడ్డలు ఊడదీసి కొడుతామని హెచ్చరించారు. నాంపల్లిలోని ఈడీ కార్యాలయంలో శుక్రవారం ఎన్​ఫోర్స్​మెంట్​ జాయింట్​ డైరెక్టర్​తో రేవంత్​రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాను గతంలో చేసిన ఫిర్యాదులు, హైకోర్టు తీర్పు, వినతిపత్రాన్ని అందించారు. డ్రగ్స్​ కేసు విచారణను ఈడీకి ఇవ్వాలని గతంలో హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌ను కూడా ఇచ్చారు.

అనంతరం రేవంత్​రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని మరో పంజాబ్​ మాదిరిగా మారుస్తున్నారని, ఇప్పటికే కళాశాలల స్థాయిలో విచ్చలవిడిగా డ్రగ్స్​ అమ్మకాలు సాగుతున్నాయని, ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే స్కూళ్లకు కూడా పాకుతుందన్నారు.

భయం ఎందుకు?

డ్రగ్స్​కేసు విచారణ వివరాలను ఈడీకి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కేసులో కొంతమంది పెద్దలు ఉన్నారని, వారిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గుట్కా లేదు, మట్కా లేదు, గుడుంబా లేదు, పేకాట లేదు.. అని ఎన్నో సార్లు సీఎం కేసీఆర్ చెప్పారని, కానీ విచ్చలవిడిగా అమ్మకాలు పెరిగాయని, తాను 2017 నుంచి విచారణ అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నానన్నారు. డ్రగ్స్ మహమ్మారి విద్యాసంస్థల్లోకి చేరిందని, డ్రగ్స్ గురించి తాను మాట్లాడితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుందని కేటీఆర్, బాల్క సుమన్ లాంటివాళ్లు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారన్నారు.

హైదరాబాద్​ నడిబొడ్డున సింగరేణి కాలనీలో జరిగిన బాలికపై అత్యాచారం గంజాయి మత్తులో చేసిందేనని, ఈ విషయం పోలీసుల విచారణలో కూడా తేలిందన్నారు. అధికారులు కూడా ఏదో చేస్తున్నట్లుగా దూల్ పేట గుడుంబా స్థావరాలపై దాడులు చేశారు కానీ, వారికి ప్రత్యామ్నాయం కల్పించలేదని, అందుకే వాళ్లు గంజాయి అమ్ముతున్నారు.. వాడుతున్నారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ పరిధిలో కాంగ్రెస్ హయాంలో 4 పబ్​లు ఉంటే అవి ఇప్పుడు 90కి చేరాయని, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే భయమేస్తోందన్నారు.

2017లో చేపట్టిన డ్రగ్స్ విచారణ ఏమయిందని, ఎందుకు అటకెక్కిందని ప్రశ్నించారు. కేసు విచారణ చేస్తున్న ఐపీఎస్​ అధికారి అకున్ సబర్వాల్ ను అర్ధాంతరంగా ఎందుకు బదిలీ చేశారని, అప్పుడు 12 సార్లు ఎఫ్ఐఆర్​చేశారని, అవి ఏమయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, అవన్నీ బయటకు రావాలని తాను అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేశానని, కానీ ప్రభుత్వం తరుఫున ముందుకు రాలేదన్నారు. దీనిపై హైకోర్టుకు కూడా వెళ్లానని, తెలంగాణ యువత, ప్రజలను డ్రగ్స్ నుంచి కాపాడుకోవాలని, నైజీరియా నుంచి వచ్చిన వాళ్లు రాజ్యం ఏలుతున్నారన్నారు.

ఈడీ అధికారులు విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వారి విచారణను వ్యతిరేకిస్తోందని ఈడీ అధికారులు చెబుతున్నారని, ప్రభుత్వం సహకరించట్లేదని ఈడీ స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ, ఈడీకి ఎందుకు ఇవ్వట్లేదన్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవాళ్లు, వాడిన వాళ్లు, అమ్మే వాళ్లు ఇలా మూడు రకాల నేరస్థులు ఉన్నారని, వారిలో ప్రభుత్వ పెద్దలున్నారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో స్వతంత్రంగా విచారణ చేయాలని కోరుతున్నానని, ఎక్సైజ్​ సేకరించిన అన్ని ఆధారాలు, సాక్ష్యాలు వెంటనే ఈడీకి అందజేసి కోర్టు ఆదేశాలు పాటించాలని కోరారు.

డ్రగ్స్ వాడే వాళ్లు ఎంత పెద్దవాళ్లయిన సరే చర్యలు తీసుకోవాలని, సినీ పరిశ్రమ ప్రముఖులకు కూడా తాను విజ్ఞప్తి చేస్తున్నానని, డ్రగ్స్ వాడకుండా చూడాలని కోరారు. వచ్చే కాంగ్రెస్​ ప్రభుత్వంలో డ్రగ్స్​ అంశంలో కఠినంగా వ్యవహరిస్తామని, డ్రగ్స్​ వాడేవాళ్లు, వ్యాపారం చేసే వాళ్లు ఏ బొక్కలో దాక్కున్నా గుంజుకు వస్తామని రేవంత్​రెడ్డి చెప్పారు.


Next Story