విద్యార్థుల భవిష్యత్‌కు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తాం

by Ratna Kumari |

విద్యార్థుల భవిష్యత్‌కు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు తన వంతు కృషి కొనసాగిస్తానని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

విద్యార్థుల భవిష్యత్‌కు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తాం
X

దిశ, కమ్మర్‌పల్లి : విద్యార్థుల భవిష్యత్‌కు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు తన వంతు కృషి కొనసాగిస్తానని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కమ్మర్‌పల్లి జూనియర్ కళాశాలలో నిర్వహించిన డ్యూయల్ డెస్క్ బెంచీల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దయానంద్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో కమ్మర్‌పల్లి జూనియర్ కళాశాలకు రూ.1.50 లక్షల విలువైన 40 డ్యూయల్ డెస్క్ బల్లలను విరాళంగా అందజేసిన దయానంద్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2023లో గ్రామ ప్రజలు, స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కమ్మర్‌పల్లికి జూనియర్ కళాశాలను మంజూరు చేశారని గుర్తు చేశారు.

విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా జూనియర్ కళాశాలకు శాశ్వత నూతన భవన నిర్మాణం కోసం అవసరమైన నిధుల మంజూరుకు ప్రభుత్వానికి తక్షణమే ప్రతిపాదనలు పంపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే కళాశాలలో మంజూరైన లెక్చరర్ పోస్టులు భర్తీ చేయడం, సిబ్బంది కొరతను నివారించడం కోసం జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కళాశాల అభివృద్ధి, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతుల కల్పనకు తన పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, సర్పంచ్ హారిక, ఉపసర్పంచ్ అశోక్, వీడీసీ అధ్యక్షుడు సుభాష్, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Next Story