ప్రతీ స్కూల్‌లో 'వాటర్ బెల్'.. గంట గంటకూ నీరు తాగాల్సిందే

by Malleboina Mahesh |

ఢిల్లీలో వడగాల్పుల నేపథ్యంలో పాఠశాలల్లో ప్రతి గంటకు 'వాటర్ బెల్' మోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు

ప్రతీ స్కూల్‌లో వాటర్ బెల్.. గంట గంటకూ నీరు తాగాల్సిందే
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ముదురుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యం పట్ల అక్కడి విద్యా శాఖ (Department of Education) అప్రమత్తమైంది. ఎండ తీవ్రత, వడగాల్పుల వల్ల విద్యార్థులు డీహైడ్రేషన్ (Dehydration) బారిన పడకుండా ఉండేందుకు అన్ని పాఠశాలల్లో ప్రతి గంటకు ఒకసారి 'వాటర్ బెల్' మోగించాలని ఆదేశించింది. ఈ వాటర్ బెల్ (Water bell) మోగిన ప్రతిసారీ విద్యార్థులందరూ విధిగా నీరు తాగేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. విద్యార్థుల శరీరంలో నీటి స్థాయి తగ్గకుండా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యం.

దీనితో పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో ఆరుబయట క్రీడలు, శారీరక కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాల ఆవరణలో స్వచ్ఛమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. వేసవి సెలవుల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని, విద్యార్థులు ఎండ ప్రభావానికి గురి కాకుండా తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Next Story