రూ.43 కోట్లతో నాచారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఫోర్-లైన్ రోడ్డు:వైరా ఎమ్మెల్యే

by Jakkula.Mamatha |

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 43 కోట్ల ప్రభుత్వ నిధులు మంజూరు చేయించి, ఫోర్-లైన్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు.

రూ.43 కోట్లతో నాచారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఫోర్-లైన్ రోడ్డు:వైరా ఎమ్మెల్యే
X

దిశ, ఏన్కూర్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 43 కోట్ల ప్రభుత్వ నిధులు మంజూరు చేయించి, ఫోర్-లైన్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు. ప్రస్తుతం ఈ రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా శనివారం ఏన్కూరు మండలం నాచారంలోని శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. "కోరిన కోరికలు తీర్చే దేవుడిగా పేరుగాంచిన నాచారం వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని అన్నారు. పూజల అనంతరం ఆలయ మేనేజర్ ఎస్.వి.డి. ప్రసాద్ ఎమ్మెల్యే దంపతులకు పట్టువస్త్రాలు బహుకరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

ఆలయ దర్శనం అనంతరం 'కమ్మ మహాజన సంఘం' ప్రతినిధులు బుగ్గినేని వెంకటేశ్వరరావు, మాదినేని అశోక్ కుమార్ తదితరులు ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌ను ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, సత్యనారాయణాచార్యులు, నాయకులు స్వర్ణ నరేంద్ర, మేడా ధర్మారావు, పంతగాని నరేష్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి తంబళ్ల సామేలు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, ముక్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఏన్కూర్ ఎస్సై సంధ్య ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story