గేమింగ్ రంగంలో నజారా టెక్నాలజీస్‌తో వొడాఫోన్ ఐడియా కీలక ఒప్పందం!

by Disha Web Desk 17 |
గేమింగ్ రంగంలో నజారా టెక్నాలజీస్‌తో వొడాఫోన్ ఐడియా కీలక ఒప్పందం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తన వినియోగదారులను కాపాడుకునేందుకు దూకుడు పెంచుతోంది. తాజాగా సబ్‌స్క్రైబర్ల కోసం దేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న గేమింగ్ రంగంలో కీలక ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా వొడాఫోన్ ఐడియా తన సబ్‌స్క్రైబర్లను కాపాడుకోవడమే కాకుండా సగటు వినియోగదారు ఆదాయం(ఆర్పు) పెంచుకునేందుకు వీలవుతుందని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ గేమింగ్, స్పోర్ట్స్ మీడియా కంపెనీ నజారా టెక్నాలజీస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే, 'వీఐ గేమ్స్' పేరుతో కొత్త గేమింగ్ సేవలను ప్రారంభించింది. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ నుంచి ఏకంగా 1,200కి పైగా ఆండ్రాయిడ్ గేమ్స్‌తో పాటు హెచ్‌టీఎంఎల్ 5 ఆధారిత గేమ్స్‌ను వొడాఫోన్ ఐడియా వినియోగదారులు యాక్సెస్ చేయవచ్చని, ఇందులో మూడు విభాగాల్లో గేమ్స్‌ను అందిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా 250 వరకు గేమ్స్‌ను ఉచితంగానే యూజర్లు వినియోగించవచ్చని పేర్కొంది.

మొత్తం మూడు విభాగాల్లో ప్రారంభించిన ఈ ప్లాట్‌ఫామ్‌లో ఉచిత గేమ్స్ విభాగంలో ఉండే వాటికి ఎలాంటి చార్జీలు ఉండవని తెలిపింది. ప్లాటినమ్ గేమ్స్ విభాగంలో సబ్‌స్క్రైబర్లు ఒక్కో గేమ్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు రూ. 25, ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ. 26 గా నిర్ణయించింది. గోల్డ్ గేమ్స్ విభాగంలో పోస్ట్ పెయిడ్ కలిగిన వారు రూ. 50, ప్రీపెయిడ్ వినియోగదారులు రూ. 56 టారిఫ్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వినియోగదారులు 30 గోల్డ్ గేమ్స్‌కు యాక్సెస్ సాధిస్తారు. దీనికి 30 రోజుల వ్యాలిడిటీ ఇవ్వనుండగా, రూ. 499 కంటే ఎక్కువ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను ఎంచుకునే సబ్‌స్క్రైబర్లకు ప్రతి నెలా 5 గోల్డ్ గేమ్స్ ఉచితంగా ఇవ్వనున్నట్టు వెల్లడించింది.


Next Story