మల్కాపురంలో అనుమతులు లేకుండానే వెంచర్

by Malleboina Mahesh |

మల్కాపూర్‌లో హెచ్ఎండీఏ, నాలా అనుమతులు లేని అక్రమ రియల్ వెంచర్.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు!

మల్కాపురంలో అనుమతులు లేకుండానే వెంచర్
X

దిశ, సంగారెడ్డి అర్బన్: వ్యవసాయ భూమిలో అక్రమ ప్లాట్ల దందాపై తీవ్ర చర్చనీయాంశమైంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులో వ్యవసాయ భూమిని అక్రమంగా ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారు. గ్రామ పొలిమేరల్లోని సర్వే నెంబర్ 158 పరిధిలో 1.08 ఎకరాల పట్టా వ్యవసాయ భూమిని కొందరు రియల్ వ్యాపారులు గ్రూపుగా ఏర్పడి రైతు నుంచి పర్సెంటీజీ ప్రాతిపదికన తీసుకుని లేఔట్ వేశారు. భూమి వ్యవసాయేతర అవసరాలకు మార్చే నాలా ప్రక్రియ పూర్తి చేయలేదు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వెంచర్ ఏర్పాటు చేశారు.

హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం లేఔట్‌లో 40 అడుగుల రహదారులు, భూగర్భ డ్రైనేజీ, పార్కు ఏర్పాటు తప్పనిసరి. కానీ ఇక్కడ కేవలం గుర్తులు వేసి ప్లాట్లుగా విభజించి, అవసరానికి బోరు బావులు కూడా తవ్వారు. ఈ అక్రమ వెంచర్‌లో గజం ధర రూ.30 నుంచి రూ. 50 వేల పలుకుతోంది. వంద గజాల స్థలం కొనేందుకు రూ.30 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే స్థలంలో ఇల్లు కట్టి రూ.50 లక్షలకే ఇస్తామంటూ ప్రచారం చేసి అమాయక కొనుగోలుదారులను ఆకర్షించే యత్నం చేస్తున్నారు.

ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన కొందరు నేతల ప్రమేయం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతరంగా మార్చేందుకు ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన రుసుము చెల్లించకుండా వెంచర్ నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకోండి

అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి ఫిర్యాదు చేశా రు. తక్షణమే రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులతో విచారణ చేయించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.-సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

Next Story