ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకి ఊహించని షాక్.. ‘జెడ్ ప్లస్’ సెక్యూరిటీ తొలగింపు

by Malleboina Mahesh |

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు భద్రత కోత! జెడ్ ప్లస్ సెక్యూరిటీని ఉపసంహరించిన పంజాబ్ ప్రభుత్వం. పార్టీతో విభేదాలే కారణమని తెలుస్తోంది.

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకి ఊహించని షాక్.. ‘జెడ్ ప్లస్’ సెక్యూరిటీ తొలగింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీలో యువనేత రాఘవ్ చద్దా (Raghav Chadha) ప్రాభవం వేగంగా తగ్గిపోతుంది. పార్టీ అధిష్టానంతో నెలకొన్న తీవ్ర విభేదాల నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం ఆయనకు మరో భారీ షాక్ ఇచ్చింది. రాఘవ్ చద్దాకు ఇప్పటివరకు అందుతున్న జెడ్ ప్లస్ (Z+) కేటగిరీ భద్రతను పంజాబ్ ప్రభుత్వం బుధవారం (ఏప్రిల్ 15, 2026) తక్షణమే ఉపసంహరించుకుంది. ఆయన భద్రతలో ఉన్న సిబ్బందిని వెంటనే తమ యూనిట్లలో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పంజాబ్ ప్రభుత్వం భద్రతను తొలగించిన వెనువెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి, ఆయనకు ఢిల్లీ పోలీసుల ద్వారా భద్రత కల్పించాలని ఆదేశించినట్లు సమాచారం.

గత కొద్ది వారాలుగా రాఘవ్ చద్దాకు, పార్టీ నాయకత్వానికి మధ్య దూరం పెరిగినట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ఏప్రిల్ 2న రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆయనను తొలగించి, ఆ స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించారు. అంతేకాకుండా, రాజ్యసభలో పార్టీ తరఫున మాట్లాడే సమయాన్ని కూడా ఆయనకు కేటాయించవద్దని ఆప్ నాయకత్వం రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాయడం సంచలనం సృష్టించింది. ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా, పంజాబ్ ప్రభుత్వంలో కీలక సలహాదారుగా వెలిగిన రాఘవ్ చద్దా.. ఇప్పుడు పార్టీలో పూర్తిగా పక్కన పెట్టబడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన "అడ్జస్ట్ (Compromised)" అయ్యారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేసిన వ్యాఖ్యలు ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోశాయి.

Next Story