కేసు తేలదు.. ఉద్యోగం రాదు

by Disha Web Desk |
కేసు తేలదు.. ఉద్యోగం రాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం చేసిన తప్పిదాలతో నిరుద్యోగులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. రూల్స్ కు విరుద్ధంగా రిక్రూట్​మెంట్లు చేయడం వలన అర్హత గల అభ్యర్థులు నష్టపోతున్నారు. దీంతో కోర్టు, తదితర కారణాలతో ఆ నోటిఫికేషన్​నియామకాల ప్రక్రియ మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీంతో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేచిచూడాల్సిన పరిస్థితులు తలెత్తింది. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఫార్మసిస్టులను నింపేందుకు 2018 జనవరిలో టీఎస్​పీఎస్సీ ఓ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. 369 ఉద్యోగాల కోసం సుమారు 12 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అదే సంవత్సరం ఏప్రిల్‌లో రాత పరీక్ష నిర్వహించి, మెరిట్ లిస్ట్ ను విడుదల చేశారు. రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించని వారు కూడా ఆ లిస్ట్‌లో ఉండటంతో నిరుద్యోగులు అభ్యంతరం తెలిపారు. దీనిపై టీఎస్​పీఎస్సీని ప్రశ్నిస్తూ, ఆందోళనలు నిర్వహించారు.

తర్వాత వారంతా ప్రభుత్వ దవాఖాన్లలో కాంట్రాక్ట్ బేసిస్‌పై పనిచేస్తున్న ఫార్మసిస్టులని, వీరికి సర్వీస్‌ వెయిటేజీ కింద 45 (30 పాయింట్లు) మార్కులు కలిపామని టీఎస్​పీఎస్సీ పేర్కొన్నది. కనీస అర్హత మార్కులు సాధించని వారికి, ఏకంగా 45 మార్కులు ఎలా కలుపుతారంటూ? నిరుద్యోగ ఫార్మసిస్టులు కోర్టులో కేసులు వేశారు. నోటిఫికేషన్‌ ప్రకారం కనీస అర్హత మార్కులు సాధించిన వారికే వెయిటేజీ ఇవ్వాలని, వెయిటేజీ మార్కులను తగ్గించాలని రెండు వేర్వేరు కేసులు పైల్​ చేశారు. వెయిటేజీ మార్కుల విషయంలో ప్రభుత్వం, నిరుద్యోగుల వాదనలు విన్న కోర్టు, 2020 సెప్టెంబర్‌‌లో వెయిటేజీ మార్కులను 45 నుంచి 30కి తగ్గిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును అమలు చేయాలని కోర్టు సూచించినా సర్కార్​ పట్టించుకోలేదు. దీంతో ఆ నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. మళ్లీ ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లు విడుదలైతే , ఆ ఉద్యోగాలు వస్తాయా? రావా? అని నిరుద్యోగులు మదన పడుతున్నారు.

కనీస అర్హత మార్కుల కేసు ఇప్పటికీ కోర్టులో అలాగే కొనసాగుతున్నది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న టీఎస్‌పీఎస్సీ, హెల్త్ డిపార్ట్‌మెంట్‌ ఇప్పటివరకూ కౌంటర్ దాఖలు చేయలేదు. కోర్టులో విచారణ ఉన్న ప్రతిసారి ఏదో ఒక కారణం చెబుతూ వాయిదా కోరుతున్నారు. దీంతో ఆ కేసు ఎటూ తెగకుండా అలాగే ఉండిపోయింది. దీనిపై హెల్త్ ఆఫీసర్లను వివరణ కోరగా, కోర్టులో ప్రభుత్వం తరఫున కౌంటర్​ దాఖలు చేస్తే, నిరుద్యోగులకు అనుకూలంగానే తీర్పు వచ్చే అవకాశం ఉన్నదని ఆఫ్​ది రికార్డులో చెబుతున్నారు. నిరుద్యోగులు ఆ కేసును విత్‌డ్రా చేసుకుంటేనే ఈ నియామక ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉన్నదని స్పష్టం చేశారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయడానికే తాము ప్రయత్నిస్తున్నామని ఓ ఆఫీసర్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఏ రిక్రూట్‌మెంట్‌లో అయినా, రాతపరీక్షలో క్వాలిఫై అయినవారికే సర్వీస్ వెయిటేజీ కలుపుతారు. ఈ రిక్రూట్‌మెంట్‌లోనూ అలాగే కలుపుతామని 2018 జనవరిలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కానీ, ఇందుకు భిన్నంగా క్వాలిఫై అవ్వని వాళ్లకు కూడా మార్కులు కలపడం గమనార్హం. 811 మందితో ఇచ్చిన మెరిట్‌ లిస్ట్‌లో 70 మంది రాత పరీక్షలో ఫెయిల్ అయినవారే ఉన్నట్లు తెలిసింది. దీంతో మెరిట్​లిస్టులో ఉన్నోళ్లకు ఉద్యోగం వస్తుందో రాదో తెలియక నాలుగు సంవత్సరాల నుంచి టీఎస్​ పీఎస్సీ, హెల్త్​ డిపార్ట్మెంట్​కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు.

Next Story

Most Viewed