HYD: మరికొద్ది గంటల్లో నీట్.. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో శనివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

HYD: మరికొద్ది గంటల్లో నీట్.. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మియాపూర్‌లో శనివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా నీట్ (NEET) ప్రవేశ పరీక్ష జరగడానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో, ఓ విద్యార్థిని పరీక్ష ఒత్తిడిని భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు కడప నగరానికి చెందిన ఓ విద్యార్థిని.. వైద్య విద్య చదవాలనే లక్ష్యంతో హైదరాబాద్ వచ్చి, మియాపూర్‌లోని ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో నీట్ లాంగ్ టర్మ్ శిక్షణ పొందుతోంది. పరీక్ష సమయం దగ్గరపడుతుండటంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన విద్యార్థిని, శనివారం తన గదిలో ఆత్మహత్య చేసుకుంది.

ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదువులో తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేకపోతున్నానని, తనను క్షమించాలంటూ ఆ లేఖలో విద్యార్థిని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Next Story