'డబుల్ ఇండ్ల' పేరుతో లబ్ధిదారులకు 'ట్రిపుల్' కష్టాలు..

by Disha Web Desk 12 |
డబుల్ ఇండ్ల పేరుతో లబ్ధిదారులకు ట్రిపుల్ కష్టాలు..
X

దిశ, చిలుకూరు: 'చూసుకొని మురవ.. చెప్పుకోను ఏడవ..' లా తయారైంది ఆర్లెగూడెంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి. గ్రామంలో నిర్మించిన 20 డబుల్ బెడ్ రూం ఇళ్లకు గానూ 2021 డిసెంబరులో అధికారులు లాటరీ పద్ధతిలో 18 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. గృహ ప్రవేశాలు ఎప్పుడు చేసుకోవాలో మాత్రం సెలవియ్య లేదు. మరి మంత్రి రావాలో, ఎమ్మెల్యే రావాలో.. నేటికీ ఆ ఇళ్లకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర వసతులు కల్పించలేదు.

నాసిరకంగా నిర్మించడంతో కొన్ని ఇళ్ల స్లాబ్ లు ఇప్పటికే పెచ్చులూడి కురుస్తుండటంతో లబ్ధిదారులే మరమ్మతులు చేయించుకుంటున్న దుస్థితి నెలకొంది. మరికొన్ని ఇండ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఇళ్ల చుట్టూ చెట్టూ చేమా మొలిచి చిట్టడవిని తలపిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇళ్ళకు వసతులు కల్పించి తమకు డబుల్ బెడ్ రూం ఇళ్లలోకి వెళ్లేందుకు అవకాశం కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


Next Story