మీరు రాష్ట్రాన్ని మత్తులో ముంచారు.. మధు యాష్కీ గౌడ్

by Disha Web Desk 13 |
మీరు రాష్ట్రాన్ని మత్తులో ముంచారు.. మధు యాష్కీ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తమ్మి తారక రామారావు.. 50 ఏళ్లలో ఏం చేసింది కాంగ్రెస్ అంటున్నావు.. కాంగ్రెస్ ఐటీకి హైదరాబాద్‌‌నీ హబ్‌ గా చేసిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ హయం‌లో హైదరాబాద్ డ్రగ్స్‌కి క్యాపిటల్ సిటీ‌గా మారిందన్నారు.


ఏడేళ్ళలో విద్యార్థులను మత్తుకు బానిసగా మార్చేశారని, హైదరాబాద్ ను విష నగరం గా చేశారని అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ మత్తులో ముంచుతూ విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచారని మండిపడ్డారు. చార్జీలు పెంచుతూ సీఎం జనాన్ని ఏప్రిల్ ఫూల్ చేశారని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. తల్లిగా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని అన్నారు.

కేసీఆర్‌కు పంటి నొప్పి వస్తే ఢిల్లీకి, టెస్టుల కోసం యశోద ఆసుపత్రికి పోతారన్నారు. ఇలాంటి వాటి కోసం ప్రత్యేక విమానంలో పోతారాని, దానికి పెట్టిన ఖర్చుతో ఒక ఐసీయూ ఏర్పాటు చేయొచ్చని హితువు పలికారు. ప్రతి గింజ కొంటా అని చెప్పిన సీఎం కల్లబొల్లి మాటలు ఆపాలని, కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనాలన్నారు.


టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కు అయ్యారని, రైతులను నట్టేట ముంచారని, ధాన్యాన్ని పంది కొక్కుల లెక్క బుక్కారని మండిపడ్డారు. నిజామాబాద్‌లో రైస్ మిల్లర్ల తో కవిత కుమ్మక్కు అయ్యిందని, బీజేపీ‌కి చిత్తశుద్ది ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. ఆత్మహత్యే చేసుకున్న రైతులకు డబ్బులు ఇస్తా అని కవిత కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. పోలీసులు ట్రాఫిక్ చాలన్ల పేరుతో 250 కోట్లు వసూలు చేశారని, పబ్బులు కట్టడి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పార్టీ బలోపేతం కోసం అన్ని రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలో పార్టీ‌కి నిరుత్సాహాన్ని కలిగించాయని, అలా కాకుండా ఉండడానికి పార్టీ దృష్టి సారించిందన్నారు. కాంగ్రెస్‌లో అన్ని గ్రూప్ నాయకులకు రాహుల్ ఆహ్వానం అందిందన్నారు. వీహెచ్, జగ్గారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి‌కి కూడా ఆహ్వానం అందినట్లు తెలిపారు.

రాష్ట్ర రాజకీయాలు.. పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతి శనివారం సమావేశాలు జరగాలని రాహుల్ అన్నారని, మాణిక్యం ఠాగూర్ కూడా అదనపు సమయం రాష్ట్రానికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ నాయకులు కలిసి‌ పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story

Most Viewed