ఖాళీలు భర్తీ చేస్తారనే గ్యారంటీ లేదు : షర్మిల ఫైర్

by Disha Web Desk |
ఖాళీలు భర్తీ చేస్తారనే గ్యారంటీ లేదు : షర్మిల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని నింపుతాడనే గ్యారంటీ తమకు లేదని వైఎస్సార్​తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల బుధవారం ట్విట్టర్​వేదికగా విమర్శలు చేశారు. పోరాటాలకు ఎంతటి నియంత పాలకులైనా తలవంచాల్సిందేనని, దానికి సీఎం ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రకటించడమే నిదర్శనమని స్పష్టం చేశారు. ఇది వైఎస్సార్​తెలంగాణ పార్టీ విజయమని ఆమె పేర్కొన్నారు. తాము పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల పక్షాన 3 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసినట్లు గుర్తుచేశారు. పార్టీ పెట్టిన తర్వాత 17 వారాల పాటు నిరుద్యోగ నిరాహార దీక్షలు చేసినట్లు చెప్పారు. తాము పోరాటం చేస్తేనే ప్రతిపక్షాలకు సోయి వచ్చిందని, అధికార పార్టీకి బుద్ధి వచ్చిందన్నారు.

అసెంబ్లీసాక్షిగా అబద్ధాలు చెప్పే అలవాటున్న కేసీఆర్, మళ్లీ అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీలుంటే, కేవలం 80వేల ఉద్యోగాలే భర్తీ చేస్తానని చెప్పడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లపై కేసీఆర్​మాట ఇచ్చినంత మాత్రాన మా పోరాటం ఆగిపోదని, ఖాళీలు పూర్తి స్థాయిలో భర్తీ చేసేవరకు తమ పోరాటం సాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ఏం చేసినా... ఆరంభం.., ఆర్భాటం.., అంతం.. అన్నట్లుగా తప్పితే.. చేసేదేమీ ఉండదని షర్మిల విమర్శలు చేశారు. నోటిఫికేషన్లు వేయకపోవడంతో ఎంతోమంది నిరుద్యోగులు చనిపోతున్నా ఉద్యోగాలు ఇవ్వకుండా తప్పుచేశానని ఒప్పుకోకుండా తన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు రాష్ట్రపతి ఆమోదం ఆలస్యమైందని కొత్త డ్రామా ఆడుతున్నారంటూ ఫైరయ్యారు. ఒక వేళ అదే నిజమనుకుంటే నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఎవరు అడ్డుపడ్డారంటూ ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్​పై వ్యతిరేకత పెరిగిపోయింది కనుకే స్వార్థ రాజకీయాల కోసం సెంటిమెంటును రెచ్చగొట్టి మళ్లీ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. అందుకే ఏదో నోటిమాటగా 80 వేల ఉద్యోగాలు నింపుతామని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు.

రెండేండ్లలో 30 వేల ఉద్యోగాలను తొలగించిన ఘనత కేసీఆర్​కు దక్కిందని చురకలంటించారు. ప్రతి నిరుద్యోగికి బాకీ పడ్డ రూ.లక్ష 20 వేల భృతిని చెల్లించాల్సిందేనని డిమాండ్​చేశారు. నోటిఫికేషన్స్ కోసం 3 నెలలు, అప్లికేషన్స్ కోసం ఇంకో మూడు నెలలు, ఎగ్జామ్స్ కు మరో 3 నెలలు, రిజల్ట్స్ కు 6 నెలలు, తీరా రిజల్ట్స్ వచ్చే సమయానికి కేసులు వేసి మరో ఏడాది పొడిగిస్తారా లేక వెంటనే నింపుతారా అని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.


Next Story

Most Viewed